|
44 ఏళ్ల చరిత్రలో..
44 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా కొత్త సంప్రదాయానికి తెర తీయాల్సి వచ్చింది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరగాల్సిన ఈ వేడుకలు సాంకేతిక హంగులతో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో జరిగిన ఈ వేడుకలకు దేశంలోని 11 సాయ్ కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. మొత్తం 74 (5 ఖేల్రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్చంద్ ) మంది ఈ ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా శనివారం 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు. రాష్ట్రపతి భవన్నుంచి రామ్నాథ్ కోవింద్, విజ్ఞాన్ భవన్నుంచి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రీడా శక్తిగా ఎదుగుతాం..
2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో టాప్-10లో నిలుస్తుందనే నమ్మకముందని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రానున్న కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చరిత్ర లిఖిస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మానసిక శక్తితో ఆటగాళ్లు కోవిడ్-19ను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను కోవింద్ స్మరించుకున్నారు.
అవార్డులు స్వీకరించని రోహిత్, ఇషాంత్
అర్జునకు ఎంపికైన ద్యూతీచంద్ (కోల్కతా), ధ్యాన్చంద్ పురస్కా రానికి ఎంపికైన ఏపీ మాజీ బాక్సర్ నగిశెట్టి ఉష, మన్జీత్ సింగ్ (రోయింగ్) హైదరాబాద్ కేంద్రం నుంచి అవార్డులు స్వీకరించారు. ఖేల్రత్నకు ఎంపికైన మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి.. పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు.
ప్రైజ్మనీ భారీగా పెంపు
క్రీడా పురస్కారాల ప్రైజ్మనీని ఈసారి నుంచి పెంచుతున్నట్టు క్రీడా మంత్రి రిజిజు తెలిపారు. ఖేల్రత్న అవార్డు గ్రహీతకు ఇప్పటిదాకా రూ. 7.5 లక్షలుండగా.. ఇకనుంచి రూ. 25 లక్షలు అందుకోనున్నారు. ఇప్పటిదాకా రూ. 5 లక్షలు అందుకున్న అర్జున అవార్డీకి ఇకనుంచి రూ. 15 లక్షలు దక్కనున్నాయి. గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ద్రోణాచార్య (జీవితసాఫల్య పురస్కారం), ధ్యాన్చంద్ గ్రహీతలకు రూ. 10 లక్షల చొప్పున పెంచారు.