
బీజింగ్: చైనా వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్లో క్రీడాకారులు నరకం అనుభవిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కఠిన కరోనా ఆంక్షలతో క్రీడాకారులను తీవ్రంగా హింసిస్తున్నారు. నిర్వాహకుల పైశాచికత్వాన్ని ఓ క్రీడాకారిణి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు పొరపాటున కరోనా సోకితే అంతే సంగతులని, ఐసోలేషన్ పేరుతో నిర్వాహకులు క్రీడాకారులకు చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రష్యాకు చెందిన వలేరియా వాస్నేత్సోవా అనే అథ్లెట్ తమ దయనీయ పరిస్థితిని ట్విటర్ వేదికగా ప్రపంచంతో పంచుకుంది. మూడు పూటలు ఒకే రకమైన ఫుడ్ అందించారని ఆరోపించింది.
'జీరో కరోనా కేసులు ఉండాలనే లక్ష్యంతో బీజింగ్ ఒలింపిక్స్కు వచ్చిన ఆటగాళ్లకు రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరపాటున పాజిటివ్ వస్తే ఐసోలేషన్కు వెళ్లాల్సిందే. ఆ బాధితుల్లో నేను ఒకదానిని. కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లో ఉంచారు. మాములుగా ఐసోలేషన్లో ఉన్న వ్యక్తులకు మంచి ఆహారం అందించడం చూస్తాం. కానీ మాకు మాత్రం మూడు పూటలు(బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్) ఒకే రకమైన ఆహారం.. ఐదు రోజుల పాటు ఇచ్చారు. ఆ ఆహారం తినాలంటేనే విసుగు పుట్టేది. దెబ్బకు నా ఎముకలన్ని బయటకు పొడుచుకొచ్చేలాగా అనిపించేది. ఒక రకంగా నరకంలా కనిపించే ఆ ఐసోలేషన్తో మమ్నల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు'' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
వింటర్ ఒలింపిక్స్కు వచ్చిన తమకు ఇక్కడి నిర్వాహకులు చుక్కలు చూపించారని జర్మనీ టీమ్ హెడ్ ఆరోపించాడు. 'వింటర్ ఒలింపిక్స్కు వస్తే.. ఇక్కడి అధికారులు మాకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన వసతి, సౌకర్యాలు కల్పించలేదు.. ఐసోలేషన్ పేరుతో మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. చిన్నవిగా ఉండే ఐసోలేషన్ గదులు.. నాణ్యత లేని ఆహారంతో మాకు నరకం చూపించారు. పీసీఆర్ టెస్టులు చేస్తున్నప్పటికి వాటి ఫలితాలు క్రీడాకారులకు అందించడం లేదు. 'అని జర్మనీ జట్టు హెడ్ డిర్క్ స్కిమ్మిలెప్ఫెన్నింగ్ తెలిపారు.