అగ్ర దేశమైనా, ఆకలి రాజ్యమైనా..
అగ్రరాజ్యమైనా, శరణార్థ అథ్లెట్ అయినా అందరి లక్ష్యం ఒక్కటే... ఒలింపిక్ పతకం. తమ కలను సాకారం చేసుకోవడానికి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు టోక్యోకు చేరారు. అమెరికానుంచి అజర్ బైజాన్ వరకు, ఆస్ట్రేలియా నుంచి అర్మేనియా వరకు... అగ్ర దేశమైనా, ఆకలి రాజ్యమైనా ఇప్పుడు అందరిదీ ఒకటే ఆట, ఒకటే భాష... తుపాకుల మోతలు లేవు, అంతర్యుద్ధం మాట వినిపించదు, కానీ సమరానికి మాత్రం లోటు లేదు... అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, శరణార్థి శిబిరం నుంచి వచ్చిన అథ్లెట్ కావచ్చు, ప్రత్యర్థిపై పైచేయి సాధించి విజయగర్వంతో చేసే సింహనాదంలో తేడా ఉండదు. కూబర్టీన్ కలల్లోంచి పుట్టి 125 ఏళ్లుగా క్రీడాకారుల గుండె చప్పుడుగా మారిన ఒలింపిక్స్ మళ్లీ వచ్చేశాయి.టోక్యోలో 'మేం ఆడితే లోకమే చూడదా?'అంటూ స్టార్లు సిద్ధమైన వేళ... ఈ పక్షం రోజులు ప్రతీ క్రీడాభిమానికి పండగే.!
నిరాడంబరంగా..
32వ ఒలింపిక్ క్రీడలు శుక్రవారం నుంచి జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్నాయి. ఇక్కడి జాతీయ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, మంగోలియన్ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్తో పాటు మరికొంత మంది విశ్వక్రీడల ఆరంభ వేడుకకు వస్తామని ఇదివరకే ప్రకటించారు. భారత తరఫున పతాకధారులుగా పురుషుల హాకీ జట్టు సారథి మన్ప్రీత్ సింగ్, బాక్సర్ మేరీకోమ్ ఉన్నారు.
339 మెడల్స్..11 వేల మంది పోటీ..
మొత్తంగా ఈ సారి ఒలింపిక్స్లో దాదాపుగా 206 దేశాల నుంచి సుమారుగా 11 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 33 క్రీడల కోసం 339 బంగారు పతకాలను నిర్వాహకులు సిద్ధం చేశారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున 127 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే రెండురోజుల ముందు నుంచే ఈ మెగాఈవెంట్కు సంబంధించిన సాఫ్ట్ బాల్, ఫుట్బాల్ టోర్నీలు ప్రారంభమైపోయాయి.
32 కిలోల బంగారం..
ఈ ఒలింపిక్స్ కోసం.. చరిత్రలోనే తొలిసారిగా రీసైక్లింగ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పతకాలు తయారుచేశారు. మెడల్స్ కోసం దాదాపు 62 లక్షల మొబైల్ ఫోన్లను రీసైక్లింగ్ చేశారు. 32 కిలోల బంగారం కూడా స్వర్ణ పతకాల కోసం ఉపయోగించారు.టోక్యో ఒలింపిక్స్లో ఇచ్చే గోల్డ్ మెడల్ బరువు 556 గ్రాములు. రజతం 550 గ్రాములు, కాంస్యం 450 గ్రాములు ఉండనుంది.2024 ఒలింపిక్స్ పారిస్(ఫ్రాన్స్)లో జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్- లాస్ ఏంజెలెస్ (అమెరికా), 2032 ఒలింపిక్స్- బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) వేదికగా జరగనున్నాయి.