ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టుపై పాకిస్థాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్థాన్ కంటే భారత జట్టు ఎంతో ఎత్తులో ఉందన్నాడు. భారత విజయంపై విమర్శలు చేస్తున్నవారికి ఇమాద్ వసీం గట్టి కౌంటరిచ్చాడు.
భారత జట్టు తమకు అనుకూలమైన పిచ్లను సిద్దం చేసుకొని, అంపైర్ల సాయంతో టీ20 ప్రపంచకప్ గెలిచిందని కొందరు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను ఇమాద్ వసీం కొట్టిపారేసాడు. పాకిస్థాన్ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత జట్టు ఛాంపియన్లా ఆడిందని స్పష్టం చేశాడు.
ఈ ప్రపంచకప్ జట్టులో పిచ్లు ఇరు జట్లకూ సమానంగానే ఉన్నాయని తెలిపాడు. కొన్నిసార్లు భారత్కే పిచ్ కండిషన్స్ ప్రతికూలంగా మారాయని, అయినప్పటికీ వారు ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని చెప్పాడు. వారి అద్భుత ప్రదర్శనను అందరూ కొనియాడాల్సిందేనన్నాడు. ఈ విజయం భారత్కు నిలకడైన ఆటతీరుకు నిదర్శనమని వసీం అభిప్రాయపడ్డాడు.

భారత జట్టు విజయాలను కించపరచడం ఇతర జట్లు మానేయాలని ఇమాద్ వసీం పిలుపునిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ నిరంతరం అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తోంది. అందుకే ఒక క్రికెట్ దేశంగా.. మనం వారి కృషిని హృదయపూర్వకంగా అభినందించాలన్నాడు. ప్రస్తుతం, క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్తో పాటు ఇతర జట్ల కంటే భారత్ శక్తివంతమైన జట్టుగా ఎదిగందనే వాస్తవాన్ని అంగీకరించాలన్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత జట్టు 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా మూడు టీ20 ప్రపంచకప్లు గెలిచిన తొలి జట్టుగా కూడా టీమిండియా రికార్డ్ సాధించింది.