కరోనా లేకుంటే..
ఇక ఈ కరోనా గత్తరే లేకుంటే.. ఈ రోజు(శుక్రవారం) జపాన్లోని టోక్యో వేదికగా విశ్వక్రీడలకు తెరలేసేది. అంగరంగ వైభవంగా టోక్యో 2020 ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు జరిగేవి. కానీ ఏం చేస్తాం.. మానవాళీ నిర్లక్ష్యమో.. డ్రాగన్ కంట్రీ చైనా కుట్రనో తెలియదు కానీ ఓ మాట.. ముచ్చట లేకుండా.. దగ్గినా భయం.. తుమ్మిన జంకే గడ్డు పరిస్థితులు నెలకున్నాయి. ఇక ప్రపంచంపై కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితమే ఈ ఏడాది జరగాల్సిన విశ్వక్రీడలను చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చే ఏడాదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో క్రీడాకారుల పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రిపేర్ అయిన ఆటగాళ్ల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన ప్లేయర్స్.. అటు టోర్నీల్లేక.. ఇటు ప్రాక్టీస్ చేసే పరిస్థితుల్లేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. దీంతో ఇంట్లో ఉండి ఏం చేయలేక కొందరూ దోమలు కొట్టుకుంటుంటే.. ఇంకొందరూ పంటపొలాల్లో పనిచేస్తున్నారు. ఇంకొందరూ బతుకుదెరువు కోసం తాత్కలిక పనులు చేస్తున్నారు.
పెయింటర్గా స్టార్ షూటర్
ఇక స్టార్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ పెయింటర్గా అవతారమెత్తింది. ఆర్థిక సమస్యలను గట్టెక్కెందుకు ఈ పని చేయాల్సి వస్తుందని తెలిపింది. ‘ఒలింపిక్స్ ప్రారంభమై ఉంటే.. మా తొలి మ్యాచ్ శనివారమే(జూలి 25) జరిగేది. కానీ కరోనా మా ఆశలను అడియాశాలు చేసింది. బుధవారం నుంచి ఎదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. మరో ఏడా వేచి చూడాలా? అనిపిస్తుంది.'అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపింది. ఇక భారత్ తరఫున టోక్యో అర్హత సాధించిన అథ్లెట్ అంజుమ్. ఇక మరో పిస్టర్ షూటర్ అభిషేక్ వర్మ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గత సోమవారమే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాడు. ఒలింపిక్స్కు మరో ఏడాది ఉండటంతో ట్రైయినింగ్ కొనసాగిస్తూ లాయర్గా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు అభిషేక్ వర్మ చెప్పుకొచ్చాడు. కరోనా తమ భావోద్వేగాలను చంపేసిందని వెయిట్ లిఫ్టర్ మినాభాయి చాను ఆవేదన వ్యక్తం చేసింది.
దోమలు కొట్టుకుంటున్న రాంకీరెడ్డి..
స్టార్ షట్లర్, మన అమలాపురం కుర్రోడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి దొమలు కొట్టుకుంటున్నాడు. ప్రాక్టీస్ చేసే పరిస్థితులు.. టోర్నీలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ఈ స్టార్ షట్లర్.. దోమల బ్యాట్తో గేమ్ ఆడుతున్నాడు. ‘ఈ వర్షకాల సమయంలో దోమలతో పెద్ద సమస్య. వాటి వల్ల ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉంది. సాయంత్ర 6 కాగానే డోర్లు, కిటికీలు మూసేసి దోమలు రాకుండా జాగ్రత్త పడుతాం. 'అని సాయిరాజ్ పేర్కొన్నాడు.
నాట్లేస్తున్న స్టార్ బాక్సర్..
ఇక స్టార్ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ పొలాల్లో నాట్లేస్తుంది. ప్రస్తుతం అస్సాంలోని తన స్వగ్రామంలో ఉంటున్న ఆమె తన తల్లికి సాయంగా ఇంటి పనులు, పోలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రతీ రోజు బాక్సింగ్ బ్యాగ్పై పంచ్లు విసురుతూ.. ట్రెడ్ మిల్ సాయంతో ఫిట్నెస్ కాపాడుకుంటుంది. ఇక తన తల్లి ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆసుపత్రి పాలైందని తెలిపింది. ఆమెకు ఎలాంటి లోటు లేకుండా కేర్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇక స్మిమ్మర్ నటరాజ్ జుట్టు పెంచుకొని ఫంకీ గాయ్గా అవతారమెత్తాడు.