గువహతి: భారత మహిళల హాకీ మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహిత సూరజ్ లతా దేవి తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. వెస్టర్న్ రైల్వే మాజీ ఉద్యోగి అయిన తన భర్త శాంత కుమార్ కనికరం లేకుండా ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడని, అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు కొట్టాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా సూటి పోటీ మాటలతో మానసకింగా హింసుస్తున్నాడని తెలిపింది.
కేసు పెట్టిన అనంతరం లతా దేవి మీడియాతో మాట్లాడారు. 2005లో వివాహం చేసుకున్నప్పటి నుంచీ తన భర్త శాంతా సింగ్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది. 'నా పెళ్లి తర్వాత నేను గెలిచిన పతకాలను మరియు ఫోటోలను నా అత్తవారింటికి తీసుకెళ్లాను. అది చూసిన నా భర్త.. వాటివల్ల ఏం ఉపయోగం అని ఎగతాళి చేశాడు. అంతేకాకుండా.. నాపై వారితో చనువుగా ఉండటం వల్లే నాకు అర్జున అవార్డు వచ్చిందని అవహేళన చేశాడు.
నా భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటివరకు ఈ విషయాలను బయటకు చెప్పకుండా ఈ బాధను సహించాను. ఎవరికైనా కొంతవరకే సహనం ఉంటుంది. ఇప్పుడు నేను సహనం కోల్పోయాను. అందుకే ఆ విషయాలన్నీ బయటపెడుతున్నా. నవంబర్ 2019లో పంజాబ్లోని కపుర్తాలాలో సుల్తాన్పూర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్వహించిన ఒక టోర్నమెంట్లో ఆడుతున్నప్పుడు నా భర్త నాపై తీవ్రంగా దాడి చేశాడు. అందుకే కేసు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాను' అని లతా దేవి తెలిపారు.
లతా దేవి కెప్టెన్సీలో భారత్ మూడు బంగారు పతకాలు సాధించింది. 2002 కామన్వెల్ గేమ్స్లో ఆమె నేతృత్వంలోని భారత్ గోల్డ్ నెగ్గంగా.. ఈ ఇతివృత్తంతోనే 2007 చెక్దే ఇండియా సినిమా వచ్చి భారీ హిట్ అందుకుంది. 2003 అఫ్రో ఏషియన్ గేమ్స్, 2004 హాకీ ఆసియా కప్లో భారత్ బంగారు పతకాలు సాధించింది.