కోల్కతా: కరోనా లాక్డౌన్ తర్వాత భారత్లో జరుగుతున్న తొలి క్రీడా ఈవెంట్ అయిన ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) విజయవంతం కావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఐఎస్ఎల్ సక్సెస్ అయితే.. ఆ స్పూర్తితో దేశంలో మరిన్ని క్రీడా ఈవెంట్స్ మొదలవుతాయని దాదా పేర్కొన్నాడు. ఏటీకే మోహన్బగాన్ జట్టు సహ యజమాని అయిన గంగూలీ గురువారం ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఈ ఫుట్బాల్ లీగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'లాక్డౌన్ తర్వాత భారత్లో జరుగుతున్న తొలి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఐఎస్ఎల్ కావడం చాలా పెద్ద విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదో శుభసూచకంగా చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణ జీవనంలోకి రావాల్సిన టైమ్ ఇది. ఐఎస్ఎల్ విజయవంతంగా పూర్తి అయితే మాత్రం అందరి మనసుల్లో ఉన్న అనుమానాలు, భయాలు తీరుతాయి. ఐఎస్ఎల్ సక్సెస్ క్రికెట్ సహా అన్ని స్పోర్ట్స్ను ప్రభావితం చేస్తుంది. క్రికెట్ డొమెస్టిక్ సీజన్ను మేము కొత్త ఏడాదిలో స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నాం.
ఈ నేపథ్యంలో ఐఎస్ఎల్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. డొమెస్టిక్ లెవెల్లో మాకు 38 జట్లు ఉన్నాయి. కానీ అన్ని టీమ్స్ను ఆడించడం ఎంతవరకు సేఫ్ అనే ఆలోచనలో ఉన్నాం. ఐఎస్ఎల్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే.. బయోబబుల్లో మేము కూడా పూర్తి స్థాయి సీజన్ను కండక్ట్ చేస్తాం. ఇప్పటికీ చాలా స్పోర్టింగ్ ఈవెంట్స్ సందిగ్దంలో ఉన్నాయి. ముందడుగు వేస్తే ఏం జరుగుతుందో ఎవ్వరికీ క్లారిటీ లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడమే ఇందుకు కారణం.'అని దాదా పేర్కొన్నాడు.
నేడు (శుక్రవారం) గోవాలోని బాంబోలిమ్ జీఎంసీ మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ తలపడనుంది. ఈనెల 23న ఒడిశాతో జరిగే మ్యాచ్తో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్లో మొత్తం 11 జట్లు 55 మ్యాచ్లు ఆడనున్నాయి. జనవరి 11తో లీగ్ మ్యాచ్లు ముగిస్తాయి. కరోనా దృష్ట్యా ఈసారి అన్ని మ్యాచ్లను గోవాలోనే నిర్వహిస్తున్నారు. నాకౌట్ మ్యాచ్ల షెడ్యూల్ను డిసెంబరులో విడుదల చేయనున్నారు.