కోట్లు వస్తుంటే లక్షల కోసం ఎవడు ఆడుతాడు?
'టెస్టు క్రికెట్ చచ్చిపోతుంది. ఎందుకంటే జనం టీ20 క్రికెట్ కావాలనుకుంటున్నారు.. టీ20లనే చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఏ ఆటగాడైనా రూ.5 లక్షల కోసం ఐదు రోజుల క్రికెట్ ఆడాలని అనుకోరు కదా. అదే టీ20లు ఆడితే కనీసం 50 లక్షలు సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని కుర్రాళ్లు కూడా ఐపీఎల్ ద్వారా 7-10 కోట్ల మధ్య ఆర్జిస్తున్నారు. టీ20 క్రికెట్ మ్యాచ్ను చూసిన కళ్లతో వన్డేను చూస్తే టెస్టు చూసినట్లే ఉంటుంది. 20 ఓవర్లు గడిచాక ఇంకా 30 ఓవర్లు బ్యాటింగ్ చేయాలా? అని అనిపిస్తుంది. టీ20లదే హవా అని చెప్పడానికి ఇదొక్కటే ఉదాహరణ" అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
చాపెల్ కారణంగానే..
ఇటీవలే తాను ఎందుకు టీమిండియా కెప్టెన్ అవ్వలేకపోయానో అనే విషయాన్ని యువీ చెప్పిన సంగతి తెలిసిందే. 'టీమిండియాకు నేను కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. అదే సమయంలో గ్రేగ్ చాపెల్ వివాదం చోటుచేసుకుంది. అప్పుడు సచిన్, చాపెల్ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో నేను సచిన్వైపే మొగ్గు చూపా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. అయితే.. అదెంతవరకు నిజమో నాకు తెలియదు.
ధోనీ కెప్టెన్ అయినా..
అప్పటికి వైస్ కెప్టెన్గా ఉన్న నన్న ఆ బాధ్యతల నుంచి తప్పించారు. 2007 ప్రపంచకప్ టోర్నీకి ముందు మేం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాం. అప్పుడు సెహ్వాగ్ జట్టులో లేడు. నేను వైస్ కెప్టెన్గా ఉన్నా. ద్రవిడ్ కెప్టెన్గా ఉన్నాడు. దీంతో నేనే కెప్టెన్ అవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అది నాకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం. అయినా, ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. అయితే, కొద్ది రోజుల తర్వాత ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని అర్థం చేసుకున్నా.
అతడే కరెక్ట్..
వన్డేల్లోనూ అతడే నాయకత్వం వహించాలని భావించా. అతడే సరైన నాయకుడని అనుకున్నా. తర్వాత నేను వరుసగా గాయాలపాలయ్యాను. దీంతో ఒకవేళ నన్ను కెప్టెన్గా చేసినా ఎక్కువ కాలం కొనసాగేవాడిని కాదని అనుకున్నా. ఏదైనా మన మంచికే జరుగుతుంది. అయితే, టీమిండియాకు నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తా. నేనెప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా. అందుకే సచిన్కు మద్దతిచ్చా'అని యువీ చెప్పుకొచ్చాడు.