న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్ చాట్ షోలో పాల్గొన్న యువీ.. రోహిత్ కెరీర్ ప్రారంభంలో చూస్తే తనకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజుమామ్ ఉల్ హక్ గుర్తుకు వచ్చాడని తెలిపాడు. అలాగే రోహిత్ను చూడగానే ఏమనిపించిందనే ప్రశ్నకు.. త్వరగా అవకాశం లభించిందనే భావన కలిగిందన్నాడు.
'తొలి సారి భారత జట్టుకు ఎంపికైన రోహిత్ శర్మను చూశాక అతడికి ఇంకా సమయం ఉందని భావించాను. అతడి కెరీర్ తొలి నాళ్లలో నాకు పాకిస్తాన్ మాజీ సారథి ఇంజమాముల్ హక్ను గుర్తుకు తెచ్చాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది. బ్యాటింగ్ కోసం క్రీజులోకి దిగాక స్ట్రైక్ తీసుకోవడం కోసం కొంత సమయం తీసుకుంటారు. బౌలర్లకు కాస్త సమయమిచ్చాకే వారు పరుగులు రాబడుతారు'అంటూ యువీ చెప్పుకొచ్చాడు.
2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్తో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్లో హిట్మ్యాన్కు బ్యాటింగ్ రాలేదు. ఇక ఇదే మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను యువీ చీల్చి చిండాడిన విషయం తెలిసిందే. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన యూవీ నయా రికార్డు సృష్టించాడు.
ఇక కెరీర్ ప్రారంభంలో కొంత తడబడిన రోహిత్.. అనంతరం తన అద్వితీయమైన ప్రదర్శనతో జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. పరిస్థితులకు తగ్గుట్టు ఎప్పటికప్పుడు తన టెక్నిక్ మార్చుకుంటూ అసాధరణ ఆటగాడిగా ఎదిగాడు. మూడు ఫార్మట్లలో ఓపెనర్గా రాణిస్తున్న రోహిత్.. దూకుడైన ఆటతో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను తలపిస్తున్నాడు.
ఇక 2003-07 మధ్య పాక్ కెప్టెన్గా వ్యవహరించిన ఇంజుమామ్ ఉల్ హక్.. పాక్ తరఫున 120 టెస్ట్లు, 300 వన్డేలు ఆడాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండే కెప్టెన్గా గుర్తింపు పొందాడు.