పంజాబ్ ఆటగాళ్లకు మార్గనిర్దేశం:
యువరాజ్ సింగ్ గతేడాది జూన్లో అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ క్రికెట్కు వీడ్కోలు పలికి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ సమయంలో విదేశీ టీ20 లీగుల్లో ఆడాడు. అక్కడ బాగానే ఆకట్టుకున్నాడు. ఓ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు. కొన్నాళ్లుగా అతడు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్కు మొహాలీలోని పీసీఏ స్టేడియంలో పంజాబ్ సంఘం తరఫున వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వయంగా బ్యాట్ పట్టుకొని నెట్స్లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. ఆటగాళ్లతో పాటు యువీ కూడా భారీ షాట్లు ఆడాడట.
పునీత్ బాలి సూచన:
యువరాజ్ సింగ్ మరో శిబిరంలో కూడా బాగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ కార్యదర్శి పునీత్ బాలి అతడిని కలిశాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని యువీని అతడు కోరాడని సమాచారం తెలిసింది. పునీత్ బాలి చెప్పిన విషయంపై కొన్ని రోజులు ఆలోచించిన యువీ.. అనుమతి కోరుతూ బీసీసీఐకి ఈమెయిల్ పంపించాడట. ఈ విషయాన్ని యువీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 'యువకులతో సమయం గడపడం, వారికి మెళకువలు నేర్పించడం బాగుంది. నెట్స్లో వారికి కొన్ని షాట్లు చూపించాను. బంతిని అద్భుతంగా బాదుతుండటంతో నాపై నాకే ఆశ్చర్యం వేసింది. అప్పటికే నేను బ్యాటింగ్ చేసి చాలా కాలమైంది' అని యువీ చెప్పాడు.
క్రికెట్ ఆడాలనిపించింది:
'రెండు నెలలు పంజాబ్ తరఫున ఆఫ్ సీజన్ శిబిరానికి వచ్చాను. యువకులతో కలిసి సాధన మ్యాచులు ఆడాను. అక్కడ పరుగులు తీశాను. ఒకరోజు పంజాబ్ కార్యదర్శి పునీత్ బాలీ నా వద్దకొచ్చి వీడ్కోలు వెనక్కి తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మొదట్లో అలా ఆలోచించలేదు కానీ తర్వాత క్రికెట్ ఆడాలనిపించింది. పంజాబ్కు ఛాంపియన్షిప్లు అందించాలని కోరిక కలిగింది. హర్భజన్ సింగ్, నేనూ వేర్వేరుగా ఎన్నో గెలిచాం. కానీ ఇద్దరం కలిసి పంజాబ్కు ఏం చేయలేదు. అదే నన్ను ఈ నిర్ణయం తీసుకొనేలా చేసింది. బీసీసీఐ అనుమతి వస్తే కేవలం టీ20లు ఆడతాను. ఏం జరుగుతుందో చూడాలి' అని యువరాజ్ చెప్పాడు.
అభిమానులకు పండగే:
ఒకవేళ బీసీసీఐ నుంచి యువరాజ్ సింగ్కి అనుమతి లభిస్తే మళ్లీ విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు అతనికి అవకాశం ఉండదు. పంజాబ్ తరఫున కొన్ని సీజన్లలో ఆడేందుకు యువీ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం అతడు టీ20లతో ప్రారంభించనున్నాడు. తర్వాత తన మనసు మార్చుకొని మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు సమాచారం తెలుస్తున్నది. ఒకవేళ యువీ మళ్లీ బరిలోకి దిగితే.. ఇక భారత అభిమానులకు పండగే.
'ఐపీఎల్ 2020 కోసం వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాం.. సామర్థ్యం ఉన్న కుర్రాళ్లను వేలంలో తీసుకున్నాం'