సౌతాంప్టన్: భారత్తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న కివీస్ 32 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ(4/76), ఇషాంత్ శర్మ(3/48), రవిచంద్రన్ అశ్విన్(2/28) ధాటికి కనీసం 200 పరుగుల మార్క్నైనా అందుకుంటుందా? అనే సందేహం కలిగింది. కానీ బౌలింగ్లో రఫ్ఫాడించిన కైల్ జెమీసన్(21), టీమ్ సౌథీ(30)బ్యాటింగ్ రాణించడం.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(49) క్రీజులో పాతుకుపోవడంతో 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. జడేజా ఓ వికెట్ తీయగా.. బుమ్రా ఒక్క వికెట్ దక్కలేదు.
అంతకుముందు 101/2 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్పై భారత్ బౌలర్లు ఎదురు దాడికి దిగారు. మరోవైపు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ధీటుగా ఎదుర్కొన్నారు. పక్కా వ్యూహంతో పూర్తిగా డిఫెన్స్కు పరిమితమయ్యారు. దాదాపు 13 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విసుగుతెప్పించారు. తొలి గంటలో భారత్కు వికెట్ దక్కలేదు. 117/2 డ్రింక్ బ్రేక్ తీసుకోగా.. ఈ విరామం భారత్కు కలిసొచ్చింది. ఈ బ్రేక్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి బంతినందిస్తూ కొన్ని సూచనలు చేశాడు. అటాకింగ్ ఫీల్డింగ్తో పాటు షాట్ ఆడేలా బంతి వేయాలని చెప్పాడు. ఇక కోహ్లీ చెప్పినట్లుగానే బాల్ వేసిన షమీ.. శుభ్మన్ గిల్ సూపర్ క్యాచ్తో రాస్ టేలర్ను పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఉత్సాహాన్ని నింపాడు.
ఆ తర్వాత హెన్రీ నికోల్స్ క్రీజులోకి రాగా.. ఇషాంత్ శర్మను బౌలింగ్కు తీసుకొచ్చిన కోహ్లీ వికెట్ రాబట్టాడు. రోహిత్ శర్మ సూపర్ క్యాచ్తో అతను వెనుదిరగ్గా.. కెరీర్లో చివరి టెస్ట్ బరిలోకి దిగిన కివీస్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్(1)ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో కివీస్ 135/5తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
ఆ తర్వాత గ్రాండ్ హోమ్, విలియమ్సన్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా.. కోహ్లీ మరోసారి షమీని రంగంలోకి దింపి ఫలితం రాబట్టాడు. అతను గ్రాండ్ హోమ్ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కైల్ జెమీసన్ అటాకింగ్ గేమ్తో ఎదురుదాడికి దిగాడు. షాట్లు ఆడుతూ.. వేగంగా పరుగులు రాబట్టాడు. మ్యాచ్లో తొలి సిక్స్ను కూడా బాదాడు. అయితే అదే జోరులో షమీ బౌలింగ్లో జెమీసన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. కానీ చేయాల్సిన నష్టం చేశాడు. ఆ తర్వాత సౌథీ- విలియమ్సన్ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన విలియమ్సన్(49)ను ఇషాంత్ సూపర్ బాల్తో ఔట్ చేశాడు. చివర్లో వాగ్నర్(0)ను అశ్విన్ ఔట్ చేయగా.. 2 సిక్స్లతో దూకుడు కనబర్చిన సౌథీని జడేజా బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.