మా బెస్ట్ ఇస్తాం..
'రెండేళ్లుగా మేమంతా నిలకడగా రాణించడం వల్లే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాం. టెస్ట్ ఫార్మాట్లో ఇలా అద్భుత ప్రదర్శన చేయడం అనుకున్నంత సులువు కాదు. వెస్టిండీస్ సిరీస్తో మా డబ్ల్యూటీసీ సైకిల్ స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఆడిన ప్రతీ సిరీస్లో మా టీమ్ బాగా ప్రదర్శన చేసింది. మా అందరికీ డబ్ల్యూటీసీ ఫైనల్ మరో మ్యాచ్ మాత్రమే. మ్యాచ్ ప్రిపరేషన్కు సౌతాంప్టన్లో సరిపడా టైమ్ దొరికింది. ఫైనల్లో మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఓ బ్యాట్స్మన్గా చాలెంజ్కు ఎప్పుడూ సిద్దంగా ఉండాలి. ఇంగ్లండ్లో ఆ సవాల్ కచ్చితంగా ఉంటుంది. కానీ క్రీజులో కుదురుకుంటే.. బ్యాటింగ్ను ఆస్వాదించవచ్చు. ఇక, తొలి టెస్ట్ ఓడిపోయాకా.. కెప్టెన్గా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం నా కెరీర్లోనే అద్భుతమైన క్షణం. నాకే కాదు జట్టులోని ప్రతీ ఒక్కరికీ ఆ విజయం చాలా ప్రత్యేకం'అని రహానే చెప్పుకొచ్చాడు.
ఆ రెండు టెస్ట్లు కివీస్కు అడ్వాంటేజ్..
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు రెండు టెస్ట్లు ఆడటం న్యూజిలాండ్కు అడ్వాంటేజ్ అని టీమిండియా టాపార్డర్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. 'నేను ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నా.. అందువల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ నాకు చాలా గొప్ప విషయం. నాతో పాటు జట్టు మొత్తం ఫైనల్ కోసం ఎదురు చూస్తోంది. రెండేళ్ల పాటు మేము పడిన కష్టం వల్లే ఫైనల్కు చేరాం. ఇక, ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం ఎవరికైనా చాలెంజే. ఎందుకంటే ఇక్కడ చాలా త్వరగా వాతవరణం మారుతుంది. వర్షం వల్ల మ్యాచ్ ఆపేసి ఫీల్డ్ను వదిలి వెళ్లిన కాసేపటికే మళ్లీ అంతా సాధారణంగా మారుతోంది. అందువల్ల ఇక్కడ ఆడేటప్పుడు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు ఇంగ్లండ్తో రెండు టెస్ట్లు ఆడటం కివీస్కు అడ్వాంటేజ్.. అయినా మా టీమ్కు చాంపియన్షిప్ గెలిచే సత్తా ఉంది'అని పుజారా పేర్కొన్నాడు.
ముమ్మరంగా ప్రాక్టీస్..
డబ్ల్యూటీసీ ఫైనల్కు సన్నాహకంగా టీమిండియా ఆడుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్లో దుమ్ములేపారు. రాహుల్ సెంచరీ చేయగా.. రోహిత్, జడేజా హాఫ్ సెంచరీలతో మెరిసారు. ఇక బౌలింగ్లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/22) రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ప్లేయర్లంతా రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం మొదలైంది. అయితే, తొలి రోజు ఆటకు సంబంధించిన వివరాలు వెల్లడించిన బోర్డు.. శనివారం జరిగిన మ్యాచ్కు చెందిన ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో పాటు పంత్, గిల్, ఇషాంత్ స్టాట్స్ను తెలిపింది. తాజాగా మూడో రోజైన ఆదివారం ఆటకు సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇక్కడ రవీంద్ర జడేజా(76 బంతుల్లో 54 నాటౌట్), మహ్మద్ సిరాజ్ గణంకాలను పంచుకుంది.
సిరీస్ కివీస్ కైవసం..
మెగా ఫైనల్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ను కివీస్ 1-0తో కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 10.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసి గెలిచింది. 1999లో స్టీఫెన్ ఫ్లెమింగ్ నాయకత్వంలోని న్యూజి లాండ్ బృందం ఇంగ్లండ్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ విజయం కివీస్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది.