సెంచూరియన్: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో భారత మహిళా క్రికెట్ రూపు రేఖలు మారిపోతాయని టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడింది. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యూపీఎల్ కూడా భారత మహిళా క్రికెట్ను మరోస్థాయికి తీసుకెళ్తుందని పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన భారత మహిళల టీమ్.. మెగా టోర్నీకి ముందు అక్కడే ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం మీడియాతో మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్.. డబ్ల్యూపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఐపీఎల్ ద్వారా పురుషుల క్రికెట్ ఎంతగా మెరుగుపడిందో.. మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా కచ్చితంగా అదే జరుగుతుంది. భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ ప్రాముఖ్యతను సొంతం చేసుకుంటుంది. దీని వల్ల యువ ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తుంది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మధ్య ఉన్న నిడివిని ఇది భర్తీ చేస్తుంది. యువ క్రీడాకారిణులు దేశవాళీ క్రికెట్ నుంచి నేరుగా అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం చాలా కష్టం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ లీగ్ వల్ల అది సులభం అవుతుంది'' అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది.
ఇక తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ..''మేము ఎప్పుడూ దూకుడుగా ఆడటానికే ప్రయత్నిస్తాం. టీమ్ మీటింగ్స్లోనూ అదే చర్చిస్తాం. పిచ్ ఎలా ఉన్నా పట్టించుకోం. బ్యాటింగ్కు దిగే ముందు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ఆట ప్రారంభిస్తాం. మా స్ట్రెక్రేట్ పట్ల అప్రమత్తంగా ఉంటాం'' అని పేర్కొంది.
దీప్తి శర్మ (3/11) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట విండీస్ 6 వికెట్లకు 94 పరుగులే చేయగలిగింది. హేలీ మాథ్యూస్ (34; 34 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. పూజ వస్త్రాకర్ (2/19), రాజేశ్వరి గైక్వాడ్ (1/9) కూడా బంతితో రాణించారు. జెమీమా (42 నాటౌట్; 39 బంతుల్లో 5×4), హర్మన్ప్రీత్ (32 నాటౌట్; 23 బంతుల్లో 4×4) చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 13.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. భారత జట్టు ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.