|
వినూత్నంగా ఆలోచించిన రాజస్థాన్..
అయితే అందరిలా చేస్తే తమకేం గుర్తింపు ఉంటుందనుకుందో ఏమో కానీ.. రాజస్థాన్ రాయల్స్ వినూత్నంగా ఆలోచించింది. అన్నీ ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో లైవ్ సెషన్స్ నిర్వహిస్తుంటే.. రాజస్థాన్ ఏకంగా తమ క్రికెటర్ల సతీమణులతో ఓ వీడియోను రూపొందించి ట్వీట్ చేసింది. దీనికి ‘ఇళ్లల్లో రాయల్స్ బాయ్స్ ఎలా ఉన్నారో వారి మహిళలు చెబుతున్నారు వినండి'అని క్యాప్షన్గా పేర్కొంది.
మా వారు వంట చేస్తున్నారండి..
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రాబిన్ ఊతప్ప, జోస్ బట్లర్ సతీమణులు మాట్లాడుతూ.. ఈ క్వారంటైన్ సమయంలో తమ వారు వంట చేస్తున్నారని తెలిపారు. యువ ప్లేయర్ రియాన్ పరాగ్ తల్లి మాట్లాడుతూ..తన కొడుకు కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడని చెప్పింది.బ్యాటింగ్ కోచ్ అమోల్ ముజుమ్దార్ కూతురు, భార్య మాట్లాడుతూ.. పాట పాడుతూ ఇళ్లంతా తిరుగుతున్నాడని, తప్ప తప్పుగా కూడా పాడుతున్నారని పేర్కొన్నారు.
సంతోషంగా ఉంది, కానీ..
ఇళ్లంతా గందరగోళం చేస్తున్నాడని పేసర్ వరుణ్ ఆరోన్ భార్య ఫిర్యాదు చేసింది. వారి ఇంట్లో ఉండటం చాలా సంతోషంగా ఉందని అందరూ అంగీకరించారు.
అయితే జోస్ బట్లర్ సతీమణి లూయిస్ బట్లర్ మాట్లాడుతూ.. ఈ ప్రశ్న రెండు వారాల తర్వాత అడిగితే మా అభిప్రాయాలు మారవచ్చని సరదాగా వ్యాఖ్యానించింది.
గత సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్ ఈ సారి టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతల నుంచి అజింక్యా రహానేను తప్పించి స్టీవ్ స్మిత్కు అప్పగించింది. అలాగే వేలంలో రాబిన్ ఊతప్ప, టామ్ కరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లను కొనుగోలుచేసింది. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. తొలుత ఏప్రిల్ 15కు ఆ తర్వాత నిరవధికంగా వాయిదా పడింది.