|
మరవలేని ప్రదర్శన..
'ఈ సిరీసులో కుర్రాడిగా బరిలోకి దిగిన సిరాజ్ మగాడిగా అవతరించాడు. తొలి టెస్టు సిరీసులోనే సిరాజ్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. ముందుండి నడిపించాడు. ఈ సిరీసులో కొత్తవాళ్ల ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'ఆసీస్ సిరీస్లో మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నాడు. మనసుపెట్టి బంతులు విసురుతున్నాడు. తొలిసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నందుకు అభినందనలు. నీ భవిష్యత్తు మరెంతో బాగుండాలి' అని మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ ట్వీట్ చేసింది. ఇక సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు కూడా సిరాజ్ను అభినందించారు.
కీలక వికెట్లు తీసి..
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెటే తీసినా రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. 19.5 ఓవర్లు విసిరిన అతను 73 పరుగులు ఇచ్చాడు. చక్కని లెంగ్తుల్లో, క్రమశిక్షణతో బంతులు విసిరాడు. అనవసర పొరపాట్లకు తావివ్వలేదు. కీలకమైన లబుషేన్, స్టీవ్స్మిత్, కామెరాన్ గ్రీన్ టెయిలెండర్లు మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ను పెవిలియన్కు పంపించాడు. షమీ, బుమ్రా, ఉమేశ్ స్థానాల్లో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్, నటరాజన్కు మెలకువలు చెబుతూ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు.
అమ్మ మాటలతోనే..
ఐదు వికెట్ల ఘనత అందుకున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని సిరాజ్ అన్నాడు. ''మా నాన్న మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేను ఐదు వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉంది. కానీ మా అమ్మతో మాట్లాడిన తర్వాతే నా మనసు కుదుట పడింది. నా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నాన్న కోరికను నేరవేర్చడంపైనే దృష్టి పెట్టేలా చేసింది. ఆ ఫోన్ కాల్ మానసికంగా నన్ను దృఢం చేసింది. టెస్ట్ల్లో భారత జట్టుకు ఆడటం మా నాన్న కోరిక. అది సాకరమయ్యేలా చేసిన ఆ దేవుడికి ధన్యవాదాలు. ఈ రోజు మా నాన్న గనుకు ఉండి ఉంటే చాలా సంతోషించేవాడు. కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాకుంటాయి. ఈ ప్రదర్శనపై మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
భారత్కు భారీ టార్గెట్..
ఇక సిరాజ్, శార్దూల్ ధాటికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 33 రన్స్ లీడ్ కలుపుకొని భారత్ ముందు 328 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు 23.3 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. భారత్ గెలవాలంటే చివరి రోజు మొత్తం ఆడాలి. ఆడటమే కాకుండా ఎదురుదాడికి దిగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడితేనే విజయం దక్కుతుంది. లేకుంటే రోజంతా టైంపాస్ చేసి డ్రాతో గట్టెక్కాలి. రోహిత్ శర్మ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ విజయం నల్లేరు మీద నడకే. కానీ ఆసీస్ బౌలింగ్ను తక్కువ అంచనా వేయలేం.