ఆరంభంలో వింతగా అనిపించింది..
‘ఆరంభంలో ప్రేక్షకుల్లేకుండా ఆడాలనే ఆలోచన మనందరికీ కొంత వింతగా అనిపించింది. దానిని కాదనలేం. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ మారిపోయింది. ట్రైనింగ్ సెషన్స్, ప్రాక్టీస్ మ్యాచ్ల వల్ల ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడటానికి సిద్దమైపోయాం. ఎందుకిలా ఆడాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటే సరి. పరిస్థితులు ఎలా ఉన్నా ఆటను ప్రేమించాల్సిందే. క్రికెట్లో ప్రేక్షక సమూహం ప్రధాన భాగమని తెలుసు. వాళ్ల కోసమే ఆడుతున్నట్లుగా భావించాలి. ఏదేమైనా క్రౌడ్ లేకపోయినా మ్యాచ్ల్లో తీవ్రత మాత్రం తగ్గదు. ఇందుకు నేను హామీ ఇస్తున్నా.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
ఆతృతగా ఉన్నాం..
‘నిజాయితీగా చెప్పాలంటే మా చుట్టూ ఉన్న పరిస్థితులకు మేం అలవాటు పడ్డాం. అంగీకరించడమే అతిపెద్ద మార్పు. తొలి రోజు నుంచే నేను ఈ ఫీలింగ్ను అనుభవిస్తున్నా. ఫస్ట్ టైమ్ బయో బబుల్ గురించి చాలా పెద్ద చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. దీనిని అంగీకరించకపోతే చాలా ఇబ్బందులు, నిరాశ కలిగేది. కానీ ఇప్పుడు అలాంటివేమి లేవు'అని విరాట్ వ్యాఖ్యానించాడు. ఓవరాల్గా తొలి మ్యాచ్ కోసం తాము ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నాడు.
మై కోవిడ్ హీరోస్ జెర్సీ
ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలా, కెప్టెన్ కోహ్లి, ఆటగాళ్లు పార్థివ్ పటేల్, దేవదత్ పడిక్కల్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మహమ్మారిపై పోరులో ముందుండి నడిపిస్తున్న యోధులను తాము ఈ విధంగా గౌరవిస్తున్నామని ఆర్సీబీ తెలిపింది. అలాగే ‘గివ్ ఇండియా ఫౌండేషన్'కు తమ మద్దతిస్తున్నామని, నిధుల సేకరణ కోసం చేపట్టే వేలానికి ఆర్సీబీ ఆడిన తొలి మ్యాచ్ జెర్సీలను విరాళంగా ఇస్తామని ఆర్సీబీ ప్రకటించింది.
ఈసారైనా..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. ఆ జట్టు ఛాంపియన్గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్కు చేరినా కప్పు సాధించలేకపోయింది. గత మూడు సీజన్లలో ప్రదర్శన ఏమాత్రం బాలేదు. 2019లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి సీజన్ను ఎలా ముగిస్తుందో చూడాలి. ఈ నెల 21న సన్రైజర్స్ హైదరాబాద్తో కోహ్లీ సేన తలపడనుంది.