న్యూజిలాండ్ 348 ఆలౌట్
ఇక అంతకముందు ఓవర్నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో విలియమ్సన్(89), రాస్ టేలర్(44), కైలీ జేమీసన్(44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ(5/65) ఐదు వికెట్లతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్ (3/99) మూడు వికెట్లు, బుమ్రా(1/88), మహ్మద్ షమీ (1/91) చెరొక వికెట్ తీశారు.
మరోసారి షా, పుజారా..
ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది యువ ఓపెనర్ పృథ్వీ షా(14) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో 27 పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(11)తో మయాంక్ ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 75 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని విడదీసి బౌల్ట్ మరోసారి దెబ్బతీశాడు. పుజారాను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్ నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫలితంగా 78/2 స్కోర్తో కోహ్లీసేన టీ విరామానికి వెళ్లింది.
కోహ్లీ మరీ ఘోరంగా..
విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే టీమిండియా భారం పడింది. అతను మూడు బౌండరీలతో చాలా కాన్ఫిడెంట్గానే కనిపించాడు. మరోవైపు మయాంక్ కూడా నిలకడగానే ఆడాడు. కానీ సౌతీ అద్భుత బంతితో కీపర్ క్యాచ్గా మయాంక్ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కోహ్లీ కూడా ఔటవ్వడంతో భారత్ 113 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 46వ ఓవర్లో బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని వెంటాడి మరి కోహ్లీ వికెట్ చేజార్చుకున్నాడు. కీలక స్థితిలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోహ్లీపై అటు అభిమానులు.. ఇటు విశ్లేషకులు మండిపడుతున్నారు.
రహానే, విహారీ ఆచితూచి..
35 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ను వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారీ గట్టెక్కించే ప్రయత్నం చేశారు. నిదానంగా ఆచితూచి ఆడుతూ.. మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు.