విరాట్ కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని ఆ ఫ్రాంచైజీ 2018 సీజన్లో రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న క్రికెటర్ కోహ్లీ. అలాంటిది ఈ సీజన్ జరగకపోతే.. ఈ రన్మిషన్ ఈ మొత్తం ఆదాయాన్ని కోల్పోనున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సూపర్ కెప్టెన్సీతో మూడు టైటిళ్లు అందించాడు. అందుకే నిషేధం ముగిసిన వెంటనే చెన్నై రూ.15 కోట్లు చెల్లించి మరి మహీని రిటైన్ చేసుకుంది. అతను కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రీ ఎంట్రీ సీజన్లోనే చెన్నైని చాంపియన్గా నిలిపాడు. అంతేకాకుండా గత సీజన్లో ఫైనల్కు చేర్చి 1 పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకున్నాడు. తన భవితవ్యంపై గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఐపీఎల్ సీజన్ అతనికి చాలా కీలకం. ఒకవేళ ఈ సీజన్ జరగకపోతే ఈ 15 కోట్లతో పాటు అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.
రోహిత్ శర్మ..
క్యాష్ రిచ్ లీగ్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మెగాలీగ్లో రోహిత్.. ముంబైకి నాలుగు టైటిళ్లు అందించాడు. గత సీజన్లో తన సూపర్ కెప్టెన్సీతో ఒక్క పరుగు తేడాతో చెన్నైను ఓడించి ముంబైని విజేతగా నిలిపాడు. ఇంత విలువైన ఆటగాడిని కేవలం రూ.15 కోట్లకే ముంబై సొంతం చేసుకోవడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనా ఈ సారి ఐపీఎల్ జరగకపోతే హిట్ మ్యాన్ ఈ అమౌంట్ మొత్తం కోల్పోనున్నాడు.
పాట్ కమిన్స్..
ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ పంట పండింది. అతనిపై కాసుల వర్షమే కురిసింది. కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా అతనికి 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత ధర పలికిన ఓవర్ సీజన్ ప్లేయర్గా కమిన్స్ రికార్డు కూడా నెలకొల్పాడు. కానీ ఏం లాభం ‘అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకు వచ్చినట్లుంది ' అతని పరిస్థితి. వేలంలో కోట్లు కురువగా.. ఇప్పుడు కరోనా రూపంలో అవి చేతికి అందకుండానే దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ రద్దయితే ఈ భారీ ధనాన్ని కమిన్స్ కోల్పోనున్నాడు. ఒకవేళ జరిగినా.. ఆస్ట్రేలియా ప్లేయర్లు పాల్గొనవద్దనే ఆంక్షలు అతనికి తీరని నష్టాన్ని మిగల్చనున్నాయి.