పాకిస్థాన్ క్రికెట్ కార్యక్రమాల్లో తాను భాగమయ్యానని వస్తున్న విమర్శలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బదులిచ్చాడు. తాను ప్రత్యక్షంగా పాకిస్థాన్కు చెందిన ఏ కార్యక్రమాల్లో భాగం కాలేదని స్పష్టం చేశాడు. ఐసీసీ, ఏసీసీ కామెంట్రీ ప్యానెల్లోనే పనిచేశానని, తన వల్ల పాకిస్థాన్కు ఎలాంటి ఆదాయం చేకూరలేదని వివరణ ఇచ్చాడు.
ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్ వేలంలో సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వేలంలో కావ్య మారన్ స్వయంగా పాల్గొని మరి అబ్రార్ అహ్మద్ను రూ.2.35 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్ ఆటగాడిని భారత యాజమాన్యం కలిగిన సన్రైజర్స్ కొనుగోలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు. సునీల్ గవాస్కర్ సైతం తన కాలమ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తీరును తప్పుబట్టాడు. ఆట కోసం భారతీయుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కావ్య మారన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. భారతీయ యజమానులు.. పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయవద్దని అభిప్రాయపడ్డాడు. పాక్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బుల నుంచి పన్ను రూపంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వెళ్తుందన్నాడు. ఆ సొమ్ముతో కొనుగోలు చేసిన ఆయుధాలతో భారత సైనికులు, పౌరుల ప్రాణనష్టానికి పరోక్షంగా కారణమవుతుందని పేర్కొన్నాడు.

సన్రైజర్స్ యజమాన్యాన్ని తప్పుబట్టిన గవాస్కర్పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆసియా కప్ 2025 సమయంలో పాకిస్థాన్ కార్యక్రమాల్లో కామెంటేటర్గా పాల్గొని ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్కు డబ్బు ఇవ్వొద్దని చెప్పిన గవాస్కర్, స్వయంగా అలాంటి షోలో ఎందుకు భాగమయ్యారంటూ పలువురు నిలదీశారు.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విమర్శలకు గవాస్కర్ వివరణ ఇచ్చాడు. 'నేను ఐసీసీ, ఏసీసీ కామెంటేటర్ల ప్యానెల్లో మాత్రమే పనిచేశాను. వాటి ద్వారా వచ్చే ఆదాయం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలకూ అందుతుంది. ఏ భారతీయ సంస్థ నుంచి కూడా పాకిస్థాన్కు నేరుగా డబ్బు వెళ్ళలేదు. నేను ఏ వ్యాఖ్యాతకు నా సొంత డబ్బును ఇవ్వలేదు.
ఇతర క్రీడల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే భారతీయులు పాకిస్థానీలకు డబ్బు ఇవ్వడం పూర్తిగా ఆపేయాలి అనేది నా విజ్ఞప్తి. గత కొన్నేళ్లుగా పాకిస్థానీలు మనకు ఇలా డబ్బు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక భారతీయుడు.. విదేశీ అనుబంధ సంస్థ ద్వారా పాకిస్థాన్ ఆటగాడికి డబ్బు ఇచ్చినా.. అది భారత ప్రజల ప్రాణనష్టానికి పరోక్షంగా దోహదపడుతుంది అనేదే నా గట్టి అభిప్రాయం’అని గవాస్కర్ స్పష్టం చేశారు.