సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. జై మహేశ్ బాబు అంటూ సందడి చేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని గతంలో అభిషేక్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఫ్యాన్ మీట్లో కెప్టెన్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్, జయదేవ్ ఉనాద్కత్లతో కలిసి అభిషేక్ శర్మ సందడి చేశాడు.
ఈ సందర్భంగా తన ఫేవరేట్ తెలుగు హీరో అయిన మహేశ్ బాబు సినిమా డైలాగ్స్ చెబుతూ ఫ్యాన్స్ను అలరించాడు. 'నేను ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా కమిట్ అయిపోతా'అని డైలాగ్ చెప్పిన అభిషేక్ శర్మ.. జై బాబు అని నినాదాలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై బ్యాటింగ్ చేయడం ట్రావిస్ హెడ్కు ఇష్టమని అభిషేక్ శర్మ తెలిపాడు.

ఈ ఈవెంట్లో అభిషేక్ శర్మకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. గట్టిగా అరుస్తూ అతనికి స్వాగతం పలకగా.. ఆ మూమెంట్ను ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఈ తమ ఫోన్లతో రికార్డ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా జై బాబు అంటూ మహేష్ బాబుపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫాలోవర్లలో ఎక్కువగా మహేష్ బాబు ఫ్యాన్సే ఉండటంతో ఇద్దరు ఆటగాళ్లు జై బాబు అని నినాదాలు చేస్తూ సందడి చేశారు.
ఐపీఎల్ 2026 సీజన్కు తాము సిద్దంగా ఉన్నామని, మీరు రెడీనా? అని కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశ్నించాడు. హెన్రీచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ సెంచరీలు చేస్తే.. 300 స్కోర్ సాధ్యమవుతుందని ఇషాన్ కిషన్ అన్నాడు. అప్పుడు అభిషేక్ తాను చెరో 70 పరుగులు చేసినా సరిపోతుందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి.
ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 42 బంతుల్లో 94 పరుగులు చేశాడు. శుక్రవారమే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసిన అభిషేక్ శర్మ.. శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్లో సన్రైజర్స్-ఏ తరఫున బరిలోకి దిగాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు.