IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ క్యాంపులో జోష్ నెలకొంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్,హిట్మ్యాన్ రోహిత్ శర్మ ముంబై అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ సారి ఎలాగైనా ఆరో ఐపీఎల్ ట్రోఫీని ముంబైకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
'ద మిక్స్' ప్రోగ్రాంలో సందడి
ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్లో నిర్వహించిన 'ద మిక్స్' అనే ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ శర్మ ఈ కామెంట్స్ చేశాడు. ప్లేయర్లు, కోచ్లు, జట్టు యాజమాన్యం, అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "మేము ఖచ్చితంగా మీ అందరి కోసం ఆరో ట్రోఫీని గెలుచేందుకు మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం" అని రోహిత్ శర్మ ప్రకటించాడు. దీంతో అక్కడున్న అభిమానుల్లో కోలాహలం మిన్నంటింది.

ఆరో ట్రోఫీ కోసం ఆరేళ్ల నిరీక్షణ
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఛాంపియన్గా నిలిచింది. అయితే 2020 తర్వాత ముంబై మళ్లీ కప్పు గెలవలేదు. గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఈ ఏడాది తెర దించాలని జట్టు యాజమాన్యం పట్టుదలగా ఉంది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో సరికొత్త వ్యూహాలు
గత రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్కు ట్రోఫీ అందించిన అనుభవం హార్దిక్ పాండ్యాకు ఉంది. ఈ ఏడాది హార్దిక్ సారథ్యంలో జట్టు మళ్లీ ట్రాక్లోకి వస్తుందని రోహిత్ శర్మ, ఇతర సీనియర్ ఆటగాళ్లు నమ్ముతున్నారు.
జట్టులో స్టార్ ప్లేయర్లు
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా ఇటీవల టీ20 ప్రపంచ కప్ గెలవడంతో మంచి ఫామ్లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 29, ఆదివారం నాడు ఆడబోతోంది. రోహిత్ శర్మ ఇచ్చిన ఈ హామీ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.