'ఆదిత్య ధర్'.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ 'ధురంధర్-2'చిత్ర దర్శకుడే.. ఈ ఆదత్య ధర్. కేవలం మూడే సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ప్రయాణం ఎందరికో ఆదర్శం.
'డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను'అని చాలా మంది నటులు చెప్పే మాట. జీవిత ప్రయాణంలో అనుకోకుండా సినీ రంగంవైపు వచ్చేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆదిత్య ధర్ కూడా ఆ బాటలో వచ్చినవాడే. టీమిండియా క్రికెటర్ కావాల్సిన ఆదిత్య ధర్.. డైరెక్టర్గా మారి బాలీవుడ్ను ఏలుతున్నాడు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆదిత్య ధర్.. కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినవాడు. భారత క్రికెటర్గా ఎదగాలనేది అతని లక్ష్యం. చిన్నప్పటి నుంచే టీమిండియాకు ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. కఠోరమైన సాధనతో ఢిల్లీ అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ 2002లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఆదిత్య ధర్కు అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది.

ఆల్రౌండర్ అయిన ఆదిత్య ధర్కు బదులు స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సెలెక్షన్ వెనుక స్టువర్ట్ బిన్నీ తండ్రి, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ రోజర్ బిన్నీ ఉండటంతో ఆదిత్య ధర్ ఏం చేయలేకపోయాడని, రోజర్ బిన్నీ రాజకీయాల వల్ల తనకు అన్యాయం జరిగిందని భావించిన ఆదిత్య ధర్.. ఎంతో ఇష్టపడిన క్రికెట్ను వదిలేసాడాని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

క్రికెట్ను వదిలేసిన అనంతరం ముంబైకి వచ్చిన ఆదిత్య ధర్.. తొలుత రచయితగా బాలీవుడ్లో అడుగుపెట్టాడు. పలు చిత్రాలకు రచయితగా, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తూ దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నాడు. 2019లో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. తొలి చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు.
ఆ తర్వాత తన సోదరుడితో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించి, తన భార్య యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో 'ఆర్టికల్ 370' చిత్రాన్ని నిర్మించి విజయం అందుకున్నాడు. గతేడాది విడుదలైన 'ధురంధర్', తాజాగా వచ్చిన 'ధురంధర్ 2' చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ముఖ్యంగా 'ధురంధర్ 2' వందల కోట్ల క్లబ్లో చేరి ఆదిత్యను అగ్ర దర్శకుల సరసన నిలబెట్టింది. 'ఉరి' సినిమా షూటింగ్ సమయంలో నటి యామీ గౌతమ్తో ప్రేమలో పడి, 2021లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2024లో ఒక కుమారుడు జన్మించాడు. మొత్తానికి క్రికెటర్ కాలేకపోయినా.. బాలీవుడ్ డైరెక్టర్గా బాక్సాఫీస్ను శాస్తున్నాడు. టీమిండియా క్రికెటర్లు సైతం తన సినిమాకు క్యూ కట్టేలా ఎదిగాడు.టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని చాటి చెప్పాడు.
