ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మెక్కలమ్ పర్యవేక్షణలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు గాడి తప్పిందని, ఆటగాళ్లకు క్రమశిక్షణ లోపించిందని తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో మద్యం తాగుతూ.. సిగరెట్లు పీల్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ విచారణలో గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో ఎదురైన ఘోర పరాజయంపై ఈసీబీ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో.. హెడ్ కోచ్ మెక్కలమ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. మైదానం బయటి వివాదాలు అతనిపై ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి.
యాషెస్ సిరీస్ మధ్యలో తొమ్మిది రోజులు విశ్రాంతి రాగా.. పలువురు ఆటగాళ్లు ఆరు రోజుల పాటు మద్యం తాగుతూ జట్టుకు దూరంగా గడిపినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో సిరీస్ సమయంలోనూ అర్థరాత్రి నైట్క్లబ్ బౌన్సర్తో బ్రూక్ వాగ్వాదానికి దిగడం తీవ్ర దుమారం రేపింది. కొందరు ఆటగాళ్లు తరుచూ క్యాసినోకు వెళ్లారని, యాషెస్లో జట్టు పేలవ ప్రదర్శనకు ఇదీ ఓ కారణమని ఈసీబీ నిర్వహించిన సమీక్షకు సంబంధించిన నివేదికలో పేర్కొన్నారు.

కెప్టెన్ బెన్ స్టోక్స్తోనూ మెక్కలమ్కు విభేదాలు తలెత్తాయని, అతను కూడా కోచ్ తీరును తప్పుబట్టాడని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు.. కోచ్ మెకల్లమ్తో ఒక గ్రూప్గా ఏర్పడ్డారని, దాంతో జట్టులో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది.
యాషెస్ సిరీస్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ కంటే ఎక్కువగా గోల్ఫ్ ఆడటం, వేపింగ్ చేయడం, పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారని ఈసీబీ నివేదిక పేర్కొంది. దూకుడుగా ఆడాలనే మెకల్లమ్ వ్యూహం ఆస్ట్రేలియా పిచ్లపై పని చేయలేదని, పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్ బి లేకపోవడం జట్టును దెబ్బతీసిందనే విమర్శలు కూడా వచ్చాయి. కోచ్గా మెకల్లమ్ ఆటగాళ్లను నియంత్రించడంలో విఫలమయ్యారని, అతిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల జట్టు ప్రదర్శన దెబ్బతిన్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇంత జరిగినా.. స్టోక్స్తో మెక్కలమ్కు సయోధ్య కుదిర్చి, అన్ని ఫార్మాట్లకు అతడినే కోచ్గా కొనసాగించాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం.
యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున జోరూట్(400) ఒక్కడే రాణించగా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.