Virat Kohli మరో సంచలన నిర్ణయం! వన్డే కెప్టెన్సీకి గుడ్ బై!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీని కూడా వదులుకునేందుకు సిద్దమయ్యాడని ప్రచారం జరుగుతుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం టెస్ట్ కెప్టెన్గా కొనసాగాలనుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి. టీ20 ప్రపంచకప్ ముందు టీ20 సారథ్యాన్ని వదిలేస్తున్నానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్లో జట్టును నడిపించిన అతనికి నిరాశే ఎదురైంది. టైటిల్ దేవుడెరుగు కనీసం సెమీస్ చేరకుండానే టీమిండియా ఇంటిదారిపట్టింది.

న్యూజిలాండ్తో సిరీస్లో...
దాంతో కోహ్లీ టీ20 కెప్టెన్సీ కెరీర్ నిరాశగా ముగిసింది. కోహ్లీ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. తన ఫస్ట్ సిరీస్లో అద్భుత విజయాన్నందించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ను రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో ఫస్ట్ టెస్ట్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా.. సెకండ్ టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చాడు. అతని కెప్టెన్సీలోని భారత్ జట్టు ముంబై టెస్ట్ను 372 పరుగుల భారీ తేడాతో గెలిచి 1-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ అనంతరం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

20 మందితో జట్టు..
ఈ టూర్లో భారత్ మూడు టెస్ట్లు, మూడు వన్డేలు ఆడనుంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను వాయిదా వేసారు. సౌతాఫ్రికాతో ఆడే మూడు టెస్ట్లు, మూడు వన్డేల కోసం బీసీసీఐ 20 మంది ప్లేయర్లను పంపాలని భావిస్తోంది. ఇందులో కొందరు భారత్-ఏ టీమ్ కోసం ఆడుతూ ప్రస్తుతం సఫారీ గడ్డపైనే ఉన్నారు. భారత్-ఏలో ఉన్న కొందరు యువ ఆటగాళ్లను నెట్ బౌలర్లుగా సీనియర్ జట్టుతోనే ఉంచనున్నారు. ప్రస్తుతం టీమ్ సెలెక్షనపై దృష్టిసారించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ వారంలో జట్టును ప్రకటించనున్నారు.

హుందాగా తప్పుకునేందుకు..
ఇక వన్డే, టీ20 ఫార్మాట్లకు ఒక్కడే కెప్టెన్ ఉంటేనే భాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీ కూడా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్కు చాలా సమయం ఉన్నదని, ఇప్పుడే వన్డే కెప్టెన్సీ మార్పు ఉండదని ప్రచారం జరగుతున్నా.. మరోవైపు విరాట్ కోహ్లీనే తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తప్పించడం కంటే.. హుందాగా తప్పుకోవడమే ఉత్తమమని కోహ్లీ భావించినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ వదులుకున్నట్లు వన్డే కెప్టెన్సీ కూడా వదిలేస్తాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications