
హైదరాబాద్: మైదానం లోపల, వెలుపల మీ అభిమాన హీరో ఎవరు? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన సమాధానం సచిన్ టెండూల్కర్. బెంగళూరులో ఆడీ ఆర్ఎస్5 సెకండ్ జనరేషన్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కోహ్లీకి అభిమానుల నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ సందర్భంగా ఓ అభిమాని మైదానం లోపల, వెలుపల మీ అభిమాన హీరో ఎవరు అని అడగ్గా 'ఇంకెవ్వరు సచిన్ టెండూల్కర్' అని ఏ మాత్రం ఆలోచించకుండా కోహ్లీ సమాధానమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది.
మరొక అభిమాని వారాంతంలో ఏం చేస్తుంటారు అని ప్రశ్నించగా 'వారాంతంలో సరదాగా గడిపేందుకు నాకు అవకాశం దొరకదు. ఒకవేళ దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్ అయ్యేందుకే ప్రయత్నిస్తా. లేదంటే నా ఫేవరేట్ కారులో మ్యూజిక్ వింటూ సుదూర ప్రాంతానికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తా' అని చెప్పాడు.

ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం బెంగళూని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
సొంత మైదానంలో పంజాబ్తో జరిగే మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఉంది. తొలి మ్యాచ్లో కోల్కతా ఆటగాళ్లు సునీల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్, నితీష్ రాణా అల్రౌండ్ ప్రదర్శనతో కోహ్లీ సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.