దుబాయ్: భారత క్రికెట్ అభిమానులకు బిగ్ న్యూస్. యూఏఈ వేదికగా అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మేరకు గురువారం అతను ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. తనపై ఉన్న ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. తన సన్నిహితులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. ఈ విషయం గురించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
'టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. భారత కెప్టెన్గా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, నా కోచ్లు, భారత విజయాన్ని ఆకాంక్షించిన ప్రతీ అభిమానికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు.
గత 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం.. 5-6 ఏళ్లుగా భారత జట్టు సారథిగా కొనసాగుతుండటంతో నాపై పని భారం ఎక్కువైంది. కాస్త విశ్రాంతి కావాలనుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్గా నా సాయశక్తులా కృషి చేశాను. ఇకపై బ్యాట్స్మెన్గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతాను.
నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులతో చర్చించాను. లీడర్షిప్ గ్రూపులో కీలకమైన రవి భాయ్, రోహిత్తో కూడా మాట్లాడాను. అందుకే దుబాయ్ వేదికగా అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. ఈ విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా, ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కూడా మాట్లాడాను. వన్డే, టెస్టు కెప్టెన్గా నా శక్తిమేర జట్టును ముందుకు నడిపిస్తాను'' అని కోహ్లీ పేర్కొన్నాడు.
టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటానని తెలపడంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను కొత్త కెప్టెన్గా నియమించనున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ తప్పుకుంటాడని నాలుగు రోజుల క్రితమే వార్తలు షికారు చేశాయి. కేవలం టెస్ట్ల్లోనే కోహ్లీ కెప్టెన్గా కొనసాగుతాడని ప్రచారం జరిగింది. కానీ విరాట్ మాత్రం వన్డే, టెస్ట్ల్లో కెప్టెన్గా ఉంటానని చెప్పాడు. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రోహిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.