న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడో టెస్ట్లో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ నిబంధనల్లో ఉన్న చిన్న లొసుగుతో కఠిన శిక్ష నుంచి తప్పించుకున్నాడు. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ రివ్యూ విషయంలో సౌతాఫ్రికా అధికారిక బ్రాడ్కాస్టర్ను తప్పుబడుతూ.. స్టంప్స్ మైక్ దగ్గరికి వెళ్లి కోహ్లీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అతనితో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ కూడా అధికారిక బ్రాడ్ కాస్టర్పై నిప్పులు చెరిగారు. అయితే ఇలా భావోద్వేగాలను అదుపు చేసుకోకుండా భారత ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే కోహ్లీ నిషేధం విధించాలన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్తో పాటు షేన్ వార్న్, ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా కోహ్లీ ప్రవర్తనను తప్పుబట్టారు. యువ ఆటగాళ్లు ఎలా అర్థం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
దాంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాటు అశ్విన్, కేఎల్ రాహుల్పై కఠిన చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కనీసం మ్యాచ్ రిఫరీ మందలింపుకు అయిన గురువుతారనుకున్నారు. కానీ.. ఐసీసీ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాడు.
భారత క్రికెటర్లు మైదానంలో తమ అసహనం వ్యక్తం చేసినా.. తెలివిగా వ్యవహరించారు. విరాట్ కోహ్లీ, అశ్విన్, రాహుల్.. తమ అసహనాన్ని టెక్నాలజీ, బ్రాడ్కాస్టర్పై వ్యక్తపరిచారే తప్ప.. ఎక్కడా మ్యాచ్ అధికారుల గురించి ప్రస్తావించలేదు. అంపైర్ నిర్ణయాలను తప్పుబట్టలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బ్రాడ్కాస్టర్ లేదా టెక్నాలజీపై క్రికెటర్లు చేసే విమర్శలకి ఎలాంటి చర్యలు లేవు. దాంతో కోహ్లీతో పాటు అశ్విన్, రాహుల్ కఠిన చర్యల నుంచి తప్పించుకున్నారు. బ్రాడ్కాస్టర్ బదులు అంపైర్పైనే ఆ కామెంట్స్ చేసుంటే ఈ ముగ్గురు ఓ మ్యాచ్ నిషేదానికి గురయ్యేవారు.