
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు రోహిత్ శర్మ ప్రయాణం దక్కన్ ఛార్జర్స్తో మొదలైంది. 2009లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన దక్కన్ ఛార్జర్స్ జట్టులో రోహిత్ శర్మ ఆటగాడిగా ఉన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
ఐపీఎల్ చరిత్రలోనే మూడుసార్లు ట్రోఫీ సాధించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించిన రోహిత్ ఐపీఎల్ కెరీర్ హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. 2008 ఐపీఎల్ మొదటి సీజన్లో రోహిత్ దక్కన్ ఛార్జర్స్ జట్టు తరఫున ఐపీఎల్ కెరీర్ని ప్రారంభించాడు. 20 ఏళ్ల వయస్సులోనే ఆరంభ సీజన్లో తన సత్తా చాటిన రోహిత్ 148 స్ట్రైక్ రేటుతో ఆ సీజన్లో 404 పరుగులు చేశాడు.
ఆ సీజన్లో ఇప్పుడు తాను కెప్టెన్గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ బౌలింగ్ చేసి హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆడిన మూడో సీజన్లలో రోహిత్ మొత్తం 1,100 పరుగులు చేశాడు. అలాంటి రోహిత్ శర్మకు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మంచి రికార్డు ఉంది.
తన కెరీర్ ఆరంభంలో ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని కూడా అందుకున్నాడు. రోహిత్ శర్మ తల్లిది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. రోహిత్ శర్మకు విశాఖపట్నంలో బాల్యస్మతులు కూడా ఉన్నాయి. దీంతో ఎప్పటి నుంచో తెలుగు అభిమానులతో అతనికి మంచి అనుబంధం ఉంది. తాజాగా గురువారం సన్రైజర్స్తో గురువారం మ్యాచ్ ఆడేందుకు నగరానికి వచ్చిన రోహిత్ తన గత అనుభవాలను పంచుకున్నాడు.
'హైదరాబాద్ సిటీ అంటే నాకెంతో ఇష్టం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ నగరంతో గొప్ప అనుబంధం ఉంది. హైదరాబాద్(దక్కన్ ఛార్జర్స్) జట్టు తరఫున ఆడిప్పుడు ఎన్నో గొప్ప మధురానుభూతులను సృష్టించాం. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ఇక్కడే నెగ్గాం. అదే ఉత్సాహాన్ని మరోసారి నేటి మ్యాచ్లో కొనసాగించాలనుకుంటున్నాం' అని రోహిత్ శర్మ వీడియో సందేశంలో పేర్కొన్నాడు.
అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఆడనున్నాడు. ఇందులో సన్రైజర్స్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించగా.. ముంబై రెండుసార్లు గెలిచింది.