ఐపీఎల్ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్సీబీ యాజమాన్యం మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం సుమారు 1.78 బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లకు పైగా) భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ జట్టును కొనుగోలు చేసింది. బ్రిటన్కు చెందిన డయాజియో అనుబంధ సంస్థ 'యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్' నుంచి ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లపై పూర్తి 100 శాతం వాటాను ఈ కన్సార్టియం సొంతం చేసుకుంది. ఈ భారీ ఒప్పందంతో ఐపీఎల్ జట్ల విలువ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.
కొత్త బాస్గా ఆర్యమన్ బిర్లా
ఈ కీలక మార్పు తర్వాత ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా(28) ఆర్సీబీ నూతన ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్యమన్ బిర్లా కేవలం వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదు.. ఆయనకు క్రికెట్తో అనుబంధం ఉంది. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఆర్యమన్ బిర్లాకు ఉంది. ఈడెన్ గార్డెన్స్లో బెంగాల్ జట్టుపై సెంచరీ సాధించిన రికార్డు కూడా ఆయన పేరిట నమోదైంది. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్తో కలిసి గతంలో ఆయన డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం విశేషం.

ఆటగాడిగా మొదలై.. యజమానిగా మారిన ప్రయాణం
ఆర్యమన్ బిర్లా ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆయనను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సమయంలో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2020లో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తనను తాను అర్థం చేసుకోవడానికి ఆ విరామం తీసుకున్న ఆర్యమన్ బిర్లా.. ఇప్పుడు తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూనే.. ఏకంగా ఓ ఐపీఎల్ జట్టుకే అధిపతిగా తిరిగి రావడం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
భారీ వ్యూహంతో నూతన కన్సార్టియం
ఈ కొనుగోలులో ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్ 'బోల్డ్ వెంచర్స్', బ్లాక్స్టోన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ భాగస్వాములుగా ఉన్నాయి. క్రీడలు, మీడియా, వ్యాపార రంగాలలో ఉన్న అనుభవాన్ని రంగరించి ఆర్సీబీని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టాలని వీరు భావిస్తున్నారు. ఆర్సీబీ ఎదుగుదలలో భాగస్వామి కావడం తన అదృష్టమని ఆర్యమన్ బిర్లా పేర్కొన్నారు.