PSL 2026: పాకిస్థాన్ టెస్ట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ జేసన్ గిలెస్పీ మళ్లీ ఆ దేశానికి తిరిగి వచ్చారు. అయితే ఈ సారి జాతీయ జట్టు కోసం కాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2026) ఫ్రాంచైజీ 'హైదరాబాద్ కింగ్స్మెన్' కోచ్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే అడుగుపెట్టిన మొదటి రోజే తనదైన కఠిన వైఖరిని ప్రదర్శించి నెట్టింట హాట్ టాపిక్గా నిలిచారు.
వచ్చింది పని చేయడానికి.. యాక్టింగ్ చేయడానికి కాదు..
సాధారణంగా ఏ జట్టులోకైనా కొత్త కోచ్ లేదా ఆటగాడు వచ్చినప్పుడు హోటల్ వద్ద గ్రాండ్గా స్వాగతం చెబుతూ.. "అరైవల్ వీడియోలు" షూట్ చేయడం ఆనవాయితీ. హైదరాబాద్ కింగ్స్మెన్ జట్టు యాజమాన్యం కూడా కోచ్ గిలెస్పీతో అలాంటి వీడియో తీయాలని ప్లాన్ చేసింది. అయితే కెమెరా ముందే ఆయన దానిని నిర్మొహమాటంగా తిరస్కరించారు. "నేను కిందకు రాను.. నాకు చాలా పని ఉంది. ఆ పిచ్చి పిచ్చి అరైవల్ వీడియోల్లో నేను నటించను" అని కోచ్ గిలెస్పీ తెగేసి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పాత గొడవలే కారణమా?
గిలెస్పీ ఇంత కఠినంగా ఉండడానికి పీసీబీతో ఆయనకు ఉన్న చేదు అనుభవాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పాక్ టెస్ట్ జట్టు కోచ్గా ఉన్నప్పుడు తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా అసిస్టెంట్ కోచ్ ను తొలగించడంపై గిలెస్పీ తీవ్రంగా మండిపడ్డారు. హెడ్ కోచ్గా తనను అవమానించారని.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కనీసం మీటింగ్లకు కూడా సరిగ్గా హాజరుకాకపోవడంపై ఆయన అప్పట్లోనే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆ పాత గాయాల వల్లే ఇప్పుడు కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెడతానని.. అనవసరపు హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ కింగ్స్మెన్ జట్టులో ఉత్సాహం
వ్యక్తిగతంగా బోర్డుపై కోపం ఉన్నప్పటికీ.. పాకిస్థాన్ క్రికెట్ టాలెంట్పై జేసన్ గిలెస్పీకి మంచి గౌరవం ఉంది. "హైదరాబాద్ కింగ్స్మెన్ జట్టుతో కలిసి పనిచేయడం ఉత్సాహంగా ఉంది. ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. కేవలం క్రికెట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి జట్టును ముందుకు నడిపించడమే తన లక్ష్యమని గిలెస్పీ స్పష్టం చేశారు.