బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'ధురంధర్ 2" సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19, 2026న విడుదలైన ఈ చిత్రం గూఢచారి వ్యవస్థ నేపథ్యంలో అద్భుతంగా రూపొందించబడింది. పాకిస్థాన్ అరాచకాలను అరికట్టేందుకు ఏజెంట్ అయిన రణవీర్ సింగ్.. ఆ దేశానికి వెళ్లి ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టాడన్నదే సినిమా కథాంశం. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ.. రణవీర్ సింగ్ అద్భుత నటన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సినిమా ఇప్పుడు పాకిస్థాన్ ప్రజలను వణికిస్తోంది. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ఈ సినిమా గురించి స్పందించినట్లుగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధురంధర్ చిత్రం చూసిన తర్వాత పాకిస్థాన్ దేశంలో ఎవడిని నమ్మలేని పరిస్థితి ఉందని షాహిద్ అఫ్రిది కామెంట్ చేసినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిలో మొదలైన గూఢచారి భయం
ఈ సినిమా ప్రభావంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమా చూసిన తర్వాత పాకిస్థాన్లో ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తోందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. తాను ఎవరితో మాట్లాడాలన్నా ఇప్పుడు వందసార్లు ఆలోచిస్తున్నానని.. ఎదురుగా ఉన్న వ్యక్తి భారత గూఢచారి ఏమో అన్న అనుమానం తనను వెంటాడుతోందని షాహిద్ అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ప్రముఖులే కాకుండా రోడ్డు పక్కన ఉండే భిక్షగాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం క్షుణ్ణంగా విచారించాలని.. వారిలో భారత ఏజెంట్లు ఉన్నారేమో తేల్చాలని అఫ్రిది వింత ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు.

క్రికెట్ బోర్డుపై అసహనం
సినిమా వివాదం పక్కన పెడితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పనితీరుపై కూడా షాహిద్ అఫ్రిది తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ముఖ్యంగా తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని వన్డే కెప్టెన్గా ఎంపిక చేయడం.. ఆ తర్వాత బంగ్లాదేశ్ వంటి జట్ల చేతిలో సిరీస్ ఓడిపోవడంపై అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలక్షన్ కమిటీకి కనీస అవగాహన లేదని.. ఏ ఫార్మాట్కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని విమర్శించాడు. దేశీ క్రికెట్లో అనుభవం లేని కుర్రాళ్లకు జాతీయ జట్టులో చోటు కల్పించడం వల్లే పాక్ క్రికెట్ పతనావస్థకు చేరుతోందని అఫ్రిది ధ్వజమెత్తారు.
సర్జరీ చేయాల్సింది సెలక్షన్ కమిటీకే..!
జట్టులో మార్పుల పేరుతో సర్జరీ చేస్తున్నామంటున్న సెలక్షన్ కమిటీకి షాహిద్ అఫ్రిది కౌంటర్ ఇచ్చారు. అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లను కావాలనే పక్కన పెడుతున్నారని.. ఇది జట్టుకు ఏ మాత్రం మేలు చేయదని హెచ్చరించారు. "జట్టులో ఆటగాళ్లను మార్చడం కాదు.. అసలు సర్జరీ చేయాల్సింది సెలక్షన్ కమిటీకే" అని షాహిద్ అఫ్రిది ఘాటుగా కామెంట్ చేశాడు. అటు ధురంధర్ సినిమా సెగ.. ఇటు క్రికెట్ బోర్డు వైఫల్యాలతో షాహిద్ అఫ్రిది ఇప్పుడు పాక్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచాడు.