భారత క్రికెట్ హిస్టరీలో మోస్ట్ టాలెంటెడ్ లెగ్ స్పిన్నర్లలో లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఒకరు. తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే సలీం మాలిక్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజాలను తన స్పిన్ మాయాజాలంతో ముప్పుతిప్పలు పెట్టిన లక్ష్మణ్.. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం కొనసాగలేకపోయారు. అయితే దానికి గల కారణాన్ని లక్ష్మణ్ శివరామకృష్ణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వైఫల్యానికి కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కారణం కాదని.. కెరీర్ పొడుగునా తాను ఎదుర్కొన్న జాత్యహంకార వివక్ష తన మనసుపై చెరపలేని ముద్ర వేసిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ శివరామకృష్ణన్ పంచుకున్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
14 ఏళ్లకే అవమానం
లక్ష్మణ్ శివరామకృష్ణన్కు వివక్ష అంటే ఏమిటో తెలియని 14 ఏళ్ల వయసులోనే మొదటి అవమానం ఎదురైంది. అప్పట్లో ఆయన చెపాక్ స్టేడియంలో భారత జట్టుకు నెట్ బౌలర్గా వెళ్లేవారు. ఓ రోజు స్కూల్ యూనిఫాంలోనే ప్రాక్టీస్ కోసం వచ్చిన ఆయనను చూసి.. ఓ సీనియర్ భారత బ్యాటర్ గ్రౌండ్ స్టాఫ్ అని పొరపాటు పడ్డారు. అంతటితో ఆగకుండా తన బూట్లను శుభ్రం చేయమని లక్ష్మణ్ శివరామకృష్ణన్ను ఆదేశించారు. ఆ వయసులో ఓ దిగ్గజ ఆటగాడు తనతో అలా ఎందుకు ప్రవర్తించారో అర్థం కాక లక్ష్మణ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఘటన అనంతరం అది కేవలం పొరపాటేనా లేక వర్ణ వివక్షా అనే విషయం ఆయనను చాలా కాలం వేధించింది.

బర్త్ డే వేడుకల్లో కన్నీటితో కేక్ కట్ చేసిన శివరామకృష్ణన్
శివరామకృష్ణన్ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఆయన 17వ పుట్టినరోజున చోటుచేసుకుంది. ఆయన పుట్టినరోజు వేడుకల కోసం సహచర క్రికెటర్లు ఓ డార్క్ చాక్లెట్ కేక్ను తీసుకువచ్చారు. ఆ సమయంలో ఓ సీనియర్ ప్లేయర్ శివరామకృష్ణన్ చర్మ రంగును ఉద్దేశించి.. " హే సన్నీ(సునీల్ గవాస్కర్).. నల్లటి అబ్బాయి కోసం సరైన రంగులో ఉన్న చాక్లెట్ కేక్ నే ఆర్డర్ చేశావు' అంటూ వెటకారంగా కామెంట్ చేశాడు. ఆ మాటలు విన్న వెంటనే లక్ష్మణ్ శివరామకృష్ణన్ తీవ్ర మనస్తాపానికి గురై.. కళ్లల్లో నీళ్లతో కేక్ కట్ చేయడానికి నిరాకరించారు. అప్పుడు సునీల్ గవాస్కర్ స్వయంగా ఆయనను ఓదార్చడంతో కన్నీళ్లతోనే కేట్ చేశారు.
స్టేడియంలోనూ వెంటాడిన వేధింపులు
ఈ వివక్ష కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాలేదు. స్టేడియంలోనూ ఈ వివక్ష ఆయనను వెంటాడింది. సొంత రాష్ట్రం తమిళనాడు జట్టులో ఆడేటప్పుడు కూడా తనను కొందరు స్టార్ ప్లేయర్లు తనను "కరుప్పా(నల్లడివాడా)" అని పిలిచేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక ఉత్తరాదిలో ముంబై, చండీగఢ్, జలంధర్ వంటి ప్రాంతాల్లో మ్యాచ్ ఆడే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులు "కాలియా.. తేరా క్యా హోగా" అంటూ హేళన చేయవారని చెప్పుకొచ్చారు. ఈ వేధింపులు ఓ యువ ఆటగాడిగా తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని.. మానసిక ఒత్తిడి కారణంగానే తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయానని లక్ష్మణ్ శివరామకృష్ణన్ వివరించారు.