స్టేడియంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. మైదానం బయట కూడా అంతే గొప్ప వ్యూహకర్త అని నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు రికార్డు ధరకు అమ్ముడవ్వడంతో 18 ఏళ్ల క్రితం షేన్ వార్న్ చేసిన ఓ ఒప్పందం ఇప్పుడు ఆయన కుటుంబానికి కోట్ల వర్షం కురిపిస్తోంది.
2008 నాటి మాస్టర్ ప్లాన్.. ఏమిటా ఒప్పందం?
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్ను కెప్టెన్గా, మెంటర్గా నియమించుకుంది. ఆ సమయంలో షేన్ వార్న్ ఓ వినూత్నమైన ఒప్పందం చేసుకున్నాడు. ఆయనకు ఇచ్చే వార్షిక వేతనంతో పాటు ప్రతి ఏడాది ఆడినందుకు జట్టులో 0.75 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇలా నాలుగు సీజన్ల పాటు జట్టుతో కొనసాగిన షేన్ వార్న్.. రాజస్థాన్ రాయల్స్లో మొత్తం 3 శాతం వాటాను సొంతం చేసుకున్నాడు.

రికార్డు ధరకు రాజస్థాన్ రాయల్స్ విక్రయం
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం మారింది. అమెరికాకు చెందిన ఓ కన్సార్టియం ఈ జట్టును 1.63 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.15,290 కోట్లు) కొనుగోలు చేసింది. 2008లో కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ ఇప్పుడు ఆకాశాన్ని తాకింది. ఈ భారీ డీల్ కారణంగా షేన్ వార్న్ వాటా విలువ కూడా ఊహించని స్థాయికి చేరింది.
షేన్ వార్న్ కుటుంబానికి దక్కేది ఎంత?
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టులో షేన్ వార్న్ కుటుంబానికి ఉన్న 3 శాతం వాటా విలువ రూ. 450 కోట్ల నుంచి రూ.460 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. "నేను జట్టును నా పద్ధతిలో నడిపించే పూర్తి స్వేచ్ఛను పొందాను." అని షేన్ వార్న్ గతంలో ఓ ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పుకున్నాడు. ఆనాడు షేన్ వార్న్ నమ్మకమే నేడు ఆయన పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా పదిలం చేసింది.
అత్యంత తెలివైన పెట్టుబడి
2019లో జట్టు విలువ 400 మిలియన్ డాలర్లు ఉన్నప్పుడు తన 3 శాతం వాటా చాలా విలువైందని షేన్ వార్న్ సరదాగా కామెంట్ చేశాడు. అది ఇప్పుడు నిజమైంది. క్రీడా ప్రపంచంలో ఓ ఆటగాడు తన నైపుణ్యంతో పాటు తన తెలివితేటలతో చేసిన అత్యంత విజయవంతమైన పెట్టుబడులలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది.