అంత ఈజీ కాదు..
‘భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ ఇవ్వాలంటే ఇప్పుడు చాలా కష్టం. క్రికెట్కు దాదాపు ఏడాది నుంచి దూరంగా ఉంటున్న అతను తన పునరాగమనాన్ని మరింత సంక్లిష్టం చేసుకున్నాడు. ధోనీ మ్యాచ్ ఫిట్నెస్పై ఎవరికీ సందేహాల్లేవ్. కానీ అతని వయసు 40కి చేరువవుతోంది. కాబట్టి.. రీఎంట్రీ అంత సులువు కాదు. అయితే అతని పునరాగమనంపై టీమిండియా మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోవాలి. అతను తన సత్తా నిరూపించుకొని, టీమ్మేనేజ్మెంట్ ఓ వ్యూహంలో భాగంగా అతన్ని కోరుకుంటే తప్ప అతను జట్టులోకి వచ్చే అవకాశం లేదు'అని వెంకటేశ్ ప్రసాద్ వెల్లడించాడు.
ఫినిషర్గా వద్దు..
ఒకవేళ టీమ్మేనేజ్మెంట్ అతన్ని తీసుకుంటే మాత్రం ఫినిషర్గా కాకుండా స్వేచ్చగా ఆడే అవకాశం ఇవ్వాలన్నాడు. తన బ్యాటింగ్ ఆర్డర్ను ముందుకు జరిపి పంపించాలన్నాడు.
‘ధోనీని ఫీనిషర్గా కాకుండా ఆడించాలంటే మాత్రం నేను అతని బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తా. మూడు, నాలుగు స్థానాల్లో ఆడాలని కోరుతా. ఒకవేళ నాకు ఇంకా 10 ఓవర్లు మాత్రమే మిగిలిఉంటే మాత్రం అప్పుడు ధోనీ ఫినిషర్గా మ్యాచ్ను ముగించమని చెబుతా. ధోనీ అనుభవాన్ని, మైదానంలో అతని సూచనలు ఎప్పటికీ మర్చిపోలేం. అవెంతో విలువైనవి'అని ఈ మాజీ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
దెబ్బకొట్టిన కరోనా..
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగిన ధోనీ.. దాదాపు 10 నెలలుగా ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2020 సీజన్తో రీఎంట్రీ ఇవ్వాలని మహీ భావించినా.. కరోనా అతని వ్యూహాలను దెబ్బకొట్టింది. ఈ క్యాష్రిచ్ లీగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ధోనీ.. నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చాడు.
తద్వారా తన సత్తా చాటి భారత జట్టులోకి పునరాగమనం ఇవ్వాలని మహీ భావించాడని తన సహచర ఆటగాళ్లు, సన్నిహితులు తెలిపారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడటంతో ఇప్పుడు ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన డైనమైట్..
భారత్ తరఫున ధోనీ ఇప్పటి వరకూ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్లు ఆడిన మహీ.. తన సూపర్ కెప్టెన్సీతో 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఐసీసీ టైటిళ్లన్నీ అందించాడు. కానీ ప్రపంచకప్ తర్వాత తనంతట తానే విశ్రాంతి తీసుకున్న మహీ ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. దీంతో అప్పట్లో ధోనీ ఆట ముగిసిందనే ప్రచారం జరిగింది. కానీ ఐపీఎల్లో సత్తాచాటి మహీ రీఎంట్రీ ఇస్తాడని అతని ఫ్యాన్స్, కొంతమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ వారి ఆశలను కరోనా రక్కసీ గల్లంతు చేసింది.
ముంబై- చెన్నై ఆల్ టైమ్ ఎలెవన్లో అసలు చాంపియన్ను మర్చిపోయాం: రోహిత్