ఇంతకేం జరిగిందంటే..?
ఐర్లాండ్ మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం ఫండ్ రైజింగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మహిళల సూపర్ 50 సిరీస్ పేరిట స్కార్చర్స్, టైఫూన్స్ జట్ల మధ్య 8 వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్లో భాగంగా ఆదివారం ‘ఓక్ హిల్ క్రికెట్ క్లబ్' మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో టైఫూన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది.ప్రత్యర్థి బౌలర్ మెక్కార్తీ వేసిన బంతి టైఫూన్స్ కెప్టెన్ లౌరా డెలనీ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ కవనాగ్ చేతిలో పడింది. ఔట్ అని భావించిన టైఫూన్స్ కెప్టెన్.. పెవిలియన్ వైపు బయలుదేరింది. కానీ అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడంతో అవాక్కై క్రీజులో నిలిచిపోయింది. అంతలోనే లెగ్ అంపైర్ ఔటివ్వడం చూసిన ప్రధాన అంపైర్ సెకన్లలో తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. ఇక ఫీల్డర్లు కూడా మెయిన్ అంపైర్ నిర్ణయంతో తొలుత షాక్కు గురయ్యారు. తర్వాత ఔటివ్వడంతో ఎగిరి గంతేశారు.
— AbkiBaarSoumyaSarkar (@SoumyaSarkarFan) August 23, 2020 |
నిద్రపోయినవా...
ఇక అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మ్యాచ్లో నిలబడి నిద్రపోతున్నావా? ఏందీ? అని ప్రశ్నిస్తున్నారు. వైడ్కు ఔట్కు తేడా తెలియని నువ్వేం అంపైర్ సామీ అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం ఆ లెగ్ అంపైర్ మంచోడు కాబట్టి నీ తప్పును సరిచేశాడని, ఇలాంటి అంపైర్ల వల్ల ఆటకు ఉన్న విలువ పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంపైరింగ్ పాఠాలు నేర్చుకొని మైదానంలోకి రావాలని, ఔట్కు వైడ్ సిగ్నల్కు తేడా తెలియడం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.
స్కార్చర్స్ గెలుపు..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్.. 39 ఓవర్లలలో 177 పరుగులకు ఆలౌటైంది. టైఫూన్స్ బౌలర్లలో జీ డింప్సే(3/21), సీ రాక్(3/29) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. స్కార్చర్ బ్యాట్స్మన్ గాబి లూయిస్ 109 బంతుల్లో 95 పరుగులతో రాణించింది. అనంతరం టైఫూన్స్ లక్ష్యచేధనకు దిగగా.. ఆ జట్టు కెప్టెన్ లౌరా డెలనీ తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్గా పెవిలియన్కు చేరింది. మరింత చెలరేగిన స్కార్చర్ బౌలర్లు ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. దీంతో స్కార్చర్ అలవోక విజయాన్నందుకుంది.
స్కార్చర్ తీన్మార్..
ఈ మహిళల సూపర్ 50 సిరీస్లో నాలుగు వన్డేలు జరగ్గా స్కార్చర్ 3-1తో లీడ్లో ఉంది. ఆగస్టు 3న జరిగిన తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభమవగా.. ఫస్ట్ మ్యాచ్లో టైఫూన్స్ 7 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. 220 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. రెండో వన్డేలో 8 వికెట్లతో గెలిచిన స్కార్చర్ సిరీస్ను సమం చేసింది. అనంతరం జరిగిన మూడో వన్డేలో కూడా గెలిచిన స్కార్చర్ 2-1తో లీడ్లోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తాజా వన్డేలో కూడా గెలిచి.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో హ్యాట్రిక్ సాధించి సిరీస్ సొంతం చేసుకునే దిశగా దూసుకెళ్తుంది.