పాచెఫ్ట్స్రూమ్: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. అసాధారణ ప్రదర్శనతో అదరగొడుతున్న షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా చెలరేగిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో పర్షావి చోప్రా(3/20) మూడు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్లో శ్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 10 ఫోర్లతో 61 నాటౌట్) రాణించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది. జార్జియా ప్లిమ్మర్(35), ఇసాబెల్లా గేజ్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో పర్షావి చోప్రా మూడు వికెట్లు తీయగా.. టిటాస్ సధు, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, షెఫాలీ వర్మ తలో వికెట్ తీసారు. పర్షావి చోప్రా ధాటికి ఐదు పరుగులకే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 14.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మ(10) విఫలమైనా.. శ్వేతా సెహ్రావత్(61 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో విజయంలో కీలక పాత్ర పోషించింది. సౌమ్య తివారితో రెండో వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచే జట్టుతో ఆదివారం భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన షెషాలీ సేన.. ఆస్ట్రేలియాతో మినహా ప్రతీ మ్యాచ్ గెలిచింది. సూపర్-6లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీగ్ దశలో సౌతాఫ్రికా, యూఏఈ , స్కాట్లాండ్ టీమ్స్ను ఓడించిన భారత్.. సూపర్-6లో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్ చేరింది. ఇక కీలక మ్యాచ్లో సమష్టిగా రాణించి ఫైనల్కు దూసుకెళ్లింది.