నీ ప్రతాపం మాపైనే ఎందుకు
‘రోహిత్ భాయ్ మాపైనే నీ ప్రతాపం చూపిస్తావెందుకు? 2015 ప్రపంచకప్ క్వార్టర్స్లో ఓ సెంచరీ, 2017 చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో మరో సెంచరీ, మొన్నటి ప్రపంచకప్లో నా పొరపాటు కారణంగా మరో సెంచరీ చేశావు. అప్పుడు ప్రేక్షకులు స్పందించిన తీరు నాకింకా గుర్తుంది. ఇక చేసేదేం లేక ఎలాగైనా నువ్వు ఔటవ్వాలని నేను కోరుకున్నా. కానీ నువ్వు 40 పరుగులకు చేరుకోగానే ఏం జరుగబోతుందో నాకు అర్థమైంది' అంటూ తమీమ్ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు.
ఒక్క బంగ్లాదేశ్లోనే మద్దతు దొరకదు..
ఇతర దేశాలతో పోలిస్తే.. ఒక్క బంగ్లాదేశ్ ప్రేక్షకుల నుంచే టీమిండియాకు ఎటువంటి మద్దతు లభించదని రోహిత శర్మ అన్నాడు. ఇక పసికూన స్థాయి నుంచి బలమైన జట్టుగా బంగ్లాదేశ్ ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడాడు. ‘భారత్, బంగ్లాదేశ్లలో క్రికెట్ అంటే పిచ్చిగా ఆరాధించే వీరాభిమానులు ఉంటారు. వారు ఎంతగా ఇష్టపడతారో ఆటలో మనవల్ల ఏదైనా తప్పు జరిగితే అంతే తీవ్రంగా విమర్శిస్తారు. బంగ్లాదేశ్లో మరీ ఎక్కువగా క్రికెట్ను ఆరాధిస్తారు. భారత్ అక్కడ మ్యాచ్ ఆడితే మాకు ప్రేక్షకుల నుంచి కనీస మద్దతు లభించదు. ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మాకు మద్దతు దొరకని ప్రదేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్ మాత్రమే' అని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు.
బంగ్లా జట్టు బలమైనది..
ప్రస్తుత బంగ్లా జట్టు భిన్నంగా తయారైందని, టీమ్లో సూపర్ ఎనర్జీ ఉందని రోహిత్ కొనియాడాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అందరూ చెప్పారనీ, తాము కూడా 2019 ప్రపంచకప్లో బంగ్లా సత్తాను చూశామన్నాడు. ఇక బంగ్లాదేశ్పై హిట్మ్యాన్కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఈ జట్టుపై ముంబైకర్ చెలరేగాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వరల్డ్కప్లో బంగ్లాపై రోహిత్ సెంచరీలు చేశాడు. తన పవర్ఫుల్ బ్యాటింగ్తో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.