T20 World Cup 2022: సౌతాఫ్రికాతో ఓటమి.. సంతోషంలో టీమిండియా ఫ్యాన్స్! ఆ బిస్కెట్ సెంటిమెంట్ రిపీట్..!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.
ఈ ఓటమి మంచిదే..
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా.. రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకోవడం టీమిండియా అభిమానులు సంతోషాన్నిస్తుంది. ఈ ఓటమి టీమిండియాకు కలిసొచ్చే అంశమేనంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో కూడా సౌతాఫ్రికా రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ను ఓడించిందని, అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ ముద్దాడిందని గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు లీగ్ దశలో సౌతాఫ్రికాతో చేతిలో భారత్ ఓడింది కాబట్టి ఈ సారి కూడా టైటిల్ భారత్కు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బిస్కెట్ సెంటీమెంట్ రిపీట్..
ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఓరియో బిస్కెట్ బ్రాండ్ అంబాసిడర్గా ధోనీ.. టీమిండియాకు ఓ సెంటిమెంట్ అనుకూలంగా ఉందని చెప్పాడు. 2011లో ఓరియో బిస్కెట్ లాంచ్ అయ్యిందని, అప్పుడు టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిందన్నాడు. మళ్లీ ఈ ఏడాది ఓరియో రీలాంచ్ అవుతుందని ఈ సారి కూడా టైటిల్ భారత్దే అంటూ జోస్యం చెప్పాడు. ఈ బిస్కెట్ సెంటిమెంట్పై భిన్నాభిప్రాయాలు వచ్చినా.. 2011లో జరిగినట్లే జరగుతుంది. దాంతో అభిమానులు ధోనీ బిస్కెట్ సెంటీమెంట్ రిపీట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.
ఇంగ్లండ్పై ఐర్లాండ్ విజయం..
టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్పై ఐర్లాండ్ విజయం సాధించడం కూడా ఈ బిస్కెట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందనడానికి ఓ ఉదహారణ. గత బుధవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. 2011 వన్డే వరల్డ్ కప్లోనూ ఐర్లాండ్... ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ విధించిన 328 పరుగుల భారీ టార్గెట్ను పసికూన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో ఛేదించింది. ఇది జరిగిన 11 ఏళ్లకు మళ్లీ ఐర్లాండ్ చేతుల్లో ఇంగ్లండ్ ఓడిపోవడం.. భారత్కు సానకూల సంకేతమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
రోహిత్ సేనకు అనుకూలంగా గ్రహాలు..
ధోనీ బిస్కెట్ సెంటీమెంట్, ఇంగ్లండ్పై ఐర్లాండ్ విజయం, సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. ఇలా 2011 ప్రపంచకప్లో జరిగినట్లే జరుగుతున్నాయని, ఈ సారి రోహిత్ సేన టైటిల్ ముద్దాడటం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సారి గ్రహాలు భారత్కు అనుకూలంగా ఉన్నాయని, రోహిత్ శర్మకు టైటిల్ యోగం ఉన్నాయని గోచరిస్తున్నాయని మీమ్స్ ట్రెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications