బ్యాడ్మింటన్ను పక్కనపెట్టి..
సూర్యకుమార్ అశోక్ యాదవ్ 1990 సెప్టెంబర్ 14న ముంబైలో జన్మించాడు. అతని తండ్రి అశోకుమార్ యాదవ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. తల్లి స్వప్నయాదవ్ గృహిణి. వారికి సూర్య ఏకైక సంతానం. దాంతో అతన్ని అల్లారి ముద్దుగా పెంచారు. 10 ఏళ్ల వయసులో క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టిన సూర్య.. రెండింటిలోనూ సత్తా చాటాడు.
అయితే రెండింటిలో ఒకదాన్నే ఎంచుకోమని తండ్రి కోరగా.. సూర్య క్రికెట్ను ఎంచుకున్నాడు. ఓ క్రికెట్ అకాడమీలో చేరి తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. మామ విజయ్ యాదవ్ కోచ్ కావడంతో అతని పని మరింత సులువైంది. స్కూల్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. కాలేజీ టోర్నీలతో పాటు జిల్లా టోర్నీల్లో అదరగొట్టాడు.
2010లో రంజీ క్రికెట్లోకి..
2010లో ముంబై జట్టు తరఫున రంజీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సూర్య.. ఫస్ట్ మ్యాచ్లోనే రాణించాడు. టీమ్ మొత్తం విఫలమైన వేళ.. 89 బంతుల్లో 73 రన్స్ చేశాడు. ఇందులో 15 బౌండరీలు బాదాడు. ఫస్ట్ మ్యాచ్తోనే ఫియర్ లెస్ బ్యాట్స్మెన్గా దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ సీజన్లోనే 11 మ్యాచ్ల్లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు.
దాంతో 2011 ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్నాడు. కానీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 2011-12 రంజీ సీజన్లో 9 మ్యాచ్ల్లో 754 రన్స్తో సత్తా చాటాడు. ఆ సీజన్లో ఒరిస్సా డబుల్ సెంచరీ బాది దేశవాళీ సంచలనమయ్యాడు. ఆ ఇన్నింగ్స్ 28 ఫోర్లు, ఓ సిక్స్తో విశ్వరూపం చూపించాడు.
ఫస్ట్ మ్యాచ్లో డకౌట్..
ఆ పెర్ఫామెన్స్తో 2012 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన సూర్య.. పుణెవారియర్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతులాడి డకౌట్గా వెనుదిరిగాడు. 2012-13 రంజీ సీజన్లో ఫామ్ కోల్పోయి విఫలమయ్యాడు. దాంతో అందరూ అతన్ని వన సీజన్ వండర్ అని విమర్శించారు. అయితే ఆ తర్వాతి సీజన్లో అతను బ్యాట్తోనే విమర్శకులకు సమాధానం చెప్పాడు. ఆ సీజన్లో మూడో హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. దాంతో 2014 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ అతన్ని 70 లక్షలకు కొనుగోలు చేసింది.
ఆ జట్టులో లోయరార్డర్లో ఆడిన సూర్య.. మెరుపులు మెరిపించాడు. అయితే 2015లో ముంబైతో జరిగిన మ్యాచ్లో నాటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అతనికి నెంబర్ 4లో ఆడే అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్లో సూర్య 20 బంతుల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. 5 సిక్సర్ల బాది ప్రత్యేకంగా గుర్తింపు పొంది పాపులారిటి సాధించాడు. 2017 వరకు ఆడపా దడపా మెరుపులు మెరిపించాడు.
2018 ఐపీఎల్ టర్నింగ్ పాయింట్..
2018 ఐపీఎల్ సూర్య కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ ఏడాది దేశవాళీలో సత్తా చాటిన సూర్యను ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో ఆ సీజన్లో అత్యధిక ధర పలికిన అనామక భారత క్రికెటర్గా సూర్య రికార్డుకెక్కాడు. ఇక ముంబై సూర్యను టాపార్డర్లోఆడించి ఫలితం రాబట్టింది. ఆ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన సూర్య 512 రన్స్ చేశాడు. 2019లో 424, 2020లో 480 రన్స్ చేశాడు. ఐపీఎల్తో పాటు దేశవాళీలో సత్తా చాటాడు. అయినా అతనికి టీమిండియా పిలుపు దక్కలేదు. సూర్యకు అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐపై కూడా విమర్శలు వచ్చాయి.
తొలి బంతినే సిక్సర్గా..
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వకపోవడంపై సూర్య సైతం బాధపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్లో అతను దిగాలుగా కూర్చున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది. కానీ ఏమాత్రం విశ్వాంస కోల్పోని సూర్య.. దేశవాళీలో దుమ్ములేపాడు. దాంతో ఈ ఏడాది భారత్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
మూడో టీ20లో చోటు దక్కలేదు. నాలుగో టీ20లో అవకాశం అందుకున్న సూర్య.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. అప్పట్లో ఈ సిక్స్ ఓ సెన్సేషన్. ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదిన సూర్య మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలోనూ దుమ్మురేపాడు. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇలానే రాణిస్తే సూర్య.. కీలక ఆల్రౌండర్గా ఎదగడం ఖాయం! ఇక ధోనీని చూసి ప్రశాంతంగా ఉండటం.. గంభీర్ను చూసి ఒత్తిడిలో ఆడటం నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సూర్య.. తన ఫేవరేట్ బ్యాట్స్మన్ సచిన్, బౌలర్ వసీం అక్రమ్ అని చెప్పుకొచ్చాడు.