జాగ్రత్తగా ఆడాడు..
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. రోహిత్ శర్మ విధ్వంసానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'ఈ మ్యాచ్లో రోహిత్ చాలా జాగ్రత్తగా ఆడాడు. చాలా సెలెక్టివ్గా షాట్లు బాదాడు. సాధారణంగా ఫ్లిక్ షాట్లు, పుల్ షాట్లు అతడు బాగా ఆడతాడు. ఈ మ్యాచ్లోనూ ఆ షాట్లతోనే అలరించాడు. ఎలాంటి తప్పిదం చేయకుండా తన బలాన్ని నమ్ముకున్నాడు. బంతి వచ్చేదాకి వెయిట్ చేశాడు.
ఆ ఒక్కటి మార్చుకుంటే..
బాల్ కట్ చేసిన విధానం, ఫుల్లింగ్ చేసిన తీరు అమోఘం. ప్రతీ బంతిని కొట్టాలనే ఉద్దేశంతో క్రీజులోకి రాలేదు... రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్కు ఇదే కారణం. అయితే.. ఆఫ్సైడ్లో ఆడాలని చూసినప్పుడే రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. అక్కడే అతను స్టాండ్స్లోకి కాకుండా గాల్లోకి బంతిని లేపుతున్నాడు. ఇదొక్క విషయంలోనే అతను జాగ్రత్తగా ఉండాలి. ఈ మ్యాచ్లో అతడు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
అదరగొట్టిన అక్షర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.
కార్తీక్ సూపర్ ఫినిష్..
అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 46 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరగబోతోంది.