లోపాలను సరిచేసుకున్నా..
‘40 ఓవర్లపాటు బాగా ఆడలేకపోతున్నాం. కొంతవరకు మా లోపాలను సరిచేసుకున్నాం. కానీ దురుదృష్టవశాత్తు ఒత్తిడికిలోనై ప్రణాళికలను అమలు పరచలేకపోతున్నాం. చివరి వరకు పోటీ ఇవ్వలేకపోయాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఢిల్లీని సాధారణ స్కోర్కే కట్టడి చేశారు. వికెట్ కూడా బాలేదు. చాలా నెమ్మదిగా.. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉంది. మేం 10-15 రన్స్ ఎక్కువగా ఇచ్చాం.
స్టోక్స్ ఆడుతాడో లేదో చూడాలి..
బెన్ స్టోక్స్ రేపే(శనివారం) క్వారంటైన్ పూర్తి చేసుకుంటాడు. మాకు ఆదివారమే మ్యాచ్ ఉంది. స్టోక్స్కు ఎలాంటి ప్రాక్టీస్ లేదు. దాని గురించి మేం చర్చించాలి. స్టోక్స్ బరిలోకి దిగే విషయంపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక తదుపరి మ్యాచ్లకు సానుకూలంగా బరిలోకి దిగుతాం. పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. ప్రస్తుతానికి మాకు అనుకూలంగా లేవు. నేను కూడా బ్యాటింగ్ బాగా చేయలేదు. బాగా ఆడాలనుకున్నాను. కానీ రాణించలేకపోయాను.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్ రాత మారలేదు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 4 సిక్స్లతో 39), షిమ్రాన్ హెట్మైర్(24 బంతుల్లో 5 సిక్స్లు 1 ఫోర్తో 45) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా, ఆండ్రూ టై చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 138 రన్స్కు ఆలౌటైంది.
రబడా తీన్మార్..
ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, స్టోయినిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. నోర్జ్, అక్షర్ పటేల్, హార్దిక్ పటేల్కు తలో వికెట్ దక్కింది. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్(13), స్టీవ్ స్మిత్(24), సంజూ శాంసన్(5), మహిపాల్ లోమ్రోర్(1) దారుణంగా విఫలమయ్యారు. అండర్-19 కుర్రాడు యశస్వీ జైస్వాల్(36 బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్లతో 34) క్రీజులో నిలదొక్కుకున్నా.. ధాటిగా ఆడలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) పోరాడినా ఫలితం లేకపోయింది.