బ్రిస్బేన్: భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆఖరి రోజు సహనంతో ఆడితేనే ఫలితం దక్కుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ అన్నాడు. గబ్బా పిచ్ విచిత్రంగా మారిందని తెలిపాడు. ఏది ఏమైనా మంగళవారం భారత జట్టు పట్టుదలతో బ్యాటింగ్ చేస్తుందని అంచనా వేశాడు. నాలుగో రోజు ఆట ముగిశాక స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
'ప్రస్తుతం మాకు అనుకూలంగానే ఉంది. గబ్బా పిచ్ వింతగా ప్రవర్తించడం మొదలైంది. కొన్ని బంతులు అనూహ్యంగా బౌన్స్ అయ్యాయి. అంటే ఆఖరి రోజు మేం చక్కని ప్రాంతాల్లో బంతులు వేయాలి. పిచ్ స్వభావాన్ని ఉపయోగించుకోవాలి. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటామన్న నమ్మకం ఉంది' అని స్మిత్ తెలిపాడు. వర్షం ప్రభావం కీలకమవుతుందా? అని ప్రశ్నించగా 'ఎవరికి తెలుసు? ఇది చాలా కఠినమైన ప్రశ్న' అని సమాధానమిచ్చాడు.
'సిడ్నీలో భారత బ్యాట్స్మన్ అద్భుతంగా ఆడారు. 130కి పైగా ఓవర్లు ఎదుర్కొన్నారు. ఆ వికెట్తో పోలిస్తే గబ్బా ఎంతో భిన్నంగా ఉంది. ఏదేమైనా మేం కొత్త వ్యూహాలకు పోకుండా ఓపికగా ఉండటం అవసరం. మంచి ప్రాంతాల్లో బంతులు విసిరి ఏమవుతుందో చూడాలి. ఆఖరి రోజు కావడంతో కుర్రాళ్లు ఆసక్తిగా ఉన్నారు' అని స్మిత్ అన్నాడు.
ఆసీస్ ఇంకాస్త ముందుగా డిక్లేర్ చేస్తే బాగుండేదా అని ప్రశ్నించగా.. 'వర్షం కురుస్తున్నప్పుడు ఎంత స్కోరు మంచిదో తెలియదు. వాతావరణాన్ని మేం అంచనావేయలేం కదా. చివరి రోజు ఏం జరుగుతుందో తెలియదు' అని పేర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ పిక్క కండరాల గాయం గురించి తనకు తెలియదన్నాడు. తొడకండరాల సమస్యతోనే మైదానం వీడాడని, అతన్ని గాయాన్ని టీమ్మేనేజ్మెంట్ పరిశీలిస్తుందని తెలిపాడు. గతంలో కూడా గాయపడి రాణించిన సందర్భాలున్నాయన్నాడు. ఇక మంగళవారం స్పిన్నర్ నాథన్ లయన్ కీలకమవుతాడని స్మిత్ చెప్పుకొచ్చాడు.
ఇక సిరాజ్, శార్దూల్ ధాటికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 33 రన్స్ లీడ్ కలుపుకొని భారత్ ముందు 328 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు 23.3 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. భారత్ గెలవాలంటే చివరి రోజు మొత్తం ఆడాలి. ఆడటమే కాకుండా ఎదురుదాడికి దిగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడితేనే విజయం దక్కుతుంది. లేకుంటే రోజంతా టైంపాస్ చేసి డ్రాతో గట్టెక్కాలి.