ముంబై: మూడు వన్డేల సిరీస్ కోసం భారత్కు వచ్చిన సౌతాఫ్రికా జట్టు ఎట్టకేలకు స్వదేశం బయలు దేరింది. ఈ సిరీస్లో భాగంగా మార్చి 12న ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా బంతి పడకుండా తుడిచిపెట్టుకుపోయింది. అనంతరం కరోనా ముప్పుతో ఈ సిరీస్ను బీసీసీఐ వాయిదా వేసింది. ముందు ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలనుకున్నా.. దేశంలో కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వాయిదా వేయడం ఉత్తమమని భావించింది.
అయితే రెండో వన్డే కోసం లక్నో చేరుకున్న సఫారీలు సిరీస్ రద్దవ్వడంతో న్యూఢిల్లీ వెళ్లారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో అనుసంధాన విమానం కోసం సోమవారం కోల్కతాలో బస చేశారు. మంగళవారం కోల్కతా నుంచి దుబాయ్ ఫ్లైట్లో సౌతాఫ్రికా పయనమయ్యారు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా మీడియాకు తెలిపారు.
'ఈ రోజు ఉదయమే సఫారీ టీమ్ సురక్షితంగా దుబాయ్కి బయల్దేరింది. అక్కడి నుంచి సఫారీ ఆటగాళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా క్యాబ్ చేసిన ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.' అని అభిషేక్ దాల్మియా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కోల్కతాలో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతోనే సఫారీ టీమ్ దుబాయ్ వెళ్లేందుకు కోల్కతాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ముప్పు తగ్గిన తర్వాత వాయిదా పడ్డ ఈ మూడు వన్డేల సిరీసును మళ్లీ నిర్వహించనున్నారు.
ఐపీఎల్ రద్దయితే ధోనీ పరిస్థితేంటి?