న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ నిర్వహణ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది నుంచి మహిళల ధనాధన్ లీగ్ నిర్వహిస్తామని తెలిపాడు. ఈ మేరకు గురువారం రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు కీలక సమాచారం అందించాడు. ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతోనే మహిళలకు కూడా ప్రత్యేకంగా ఐపీఎల్ నిర్వహించాలని చాలా ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే టీ20 ఛాలెంజ్ పేరిట కొన్ని మ్యాచ్లను బీసీసీఐ నిర్వహిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి టోర్నీ మాత్రం నిర్వహించలేదు.
మహిళల క్రికెట్ అభివృద్దికి ఐపీఎల్ నిర్వహించడమే కరెక్ట్ అని భావించిన బీసీసీఐ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మహిళల ఐపీఎల్ నిర్వహణపై కీలక అప్డేట్ ఇచ్చాడు. పురుషుల ఐపీఎల్కు సంబంధించి కూడా కీలక ప్రకటన చేశాడు. కరోనాకు ముందు నిర్వహించినట్లు 'సొంత మైదానం-బయట మైదానం' తరహాలో వచ్చే సీజన్ను నిర్వహిస్తామని గంగూలీ పేర్కొన్నాడు. గత సీజన్ను కేవలం నాలుగు మైదానాలకే పరిమితం చేసిన విషయం తెలిసిందే.
'ప్రస్తుతం బీసీసీఐ మహిళల ఐపీఎల్పైనా కసరత్తు చేస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాం. అలాగే పురుషుల టీ20 లీగ్ కూడా గతంలో జట్టుకు సొంత మైదానాల్లో ఆడే అవకాశం ఉండేది. అయితే, కరోనా కారణంగా గత సీజన్లో కుదరలేదు. అందుకే వచ్చే సీజన్కు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం'అని గంగూలీ రాష్ట్రాలకు తెలిపినట్లు తెలిసింది.