మా బౌలర్లు సూపర్..
'రెండో ఇన్నింగ్స్లో మేం తిరిగి పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. మా స్కోర్ తక్కువని భావించాం కానీ తర్వాత వికెట్ నెమ్మదించింది. మా బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. డ్యూ ప్రభావం కారణంగా టాస్ గెలిస్తే మేమూ మొదట బౌలింగే ఎంచుకునే వాళ్లం. అదృష్టం కొద్దీ రెండో ఇన్నింగ్స్లో రాణించాం. కెప్టెన్సీ విషయానికొస్తే బాగా ఆస్వాదిస్తున్నా. అందుకు కారణం మా ఆటగాళ్లు. వాళ్లెంతో మెరుగ్గా రాణించి పరిస్థితులను తేలిక చేస్తున్నారు. రోజు రోజుకూ మెరుగవ్వడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉంది.'అని అయ్యర్ తెలిపాడు.
ఏదైనా జరగవచ్చు..
ఇక లక్ష్యచేధనలో రాజస్థాన్ తడబడినప్పుడు టార్గెట్ కాపాడుకుంటామనే నమ్మకం కలిగిందా అని ప్రశ్నించగా.. ‘ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ దశలోనైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అందుకే మేం జట్టును తేలిగ్గా తీసుకోం. ప్రతీ మ్యాచ్కు ప్రత్యర్థికి అనుగుణంగా ప్రణాళికలతో బరిలోకి దిగి అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మా సపోర్ట్ స్టాఫ్ మద్దతు పట్ల కూడా సంతోషంగా ఉన్నా. వారు మమ్మల్ని అద్బుతంగా సిద్దం చేస్తున్నారు. ఇదే జోరును ముందు కొనసాగించాలని ఉంది. ఏ మ్యాచ్ను కూడా తేలిగ్గా తీసుకోం.' అని శ్రేయస్ పేర్కొన్నాడు.
హెట్మైర్ మెరుపులు..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.