ఐపీఎల్లో దిమ్మతిరిగే సర్ప్రైజ్లు ఎక్కువ.. ఏ జట్టును తేలిగ్గా తీసుకోం: శ్రేయస్ అయ్యర్

షార్జా: ఐపీఎల్లో దిమ్మతిరిగే సర్ప్రైజ్లుంటాయని, ఎప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఊహించలేమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. దాంతోనే తాము ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని స్పష్టం చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 46 పరుగులతో గెలుపొంది టేబుల్ టాపర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్లో తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, తొలి ఇన్నింగ్స్ అయ్యాక తమ స్కోర్ తక్కువేమో అనిపించిందన్నాడు.

మా బౌలర్లు సూపర్..
'రెండో ఇన్నింగ్స్లో మేం తిరిగి పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. మా స్కోర్ తక్కువని భావించాం కానీ తర్వాత వికెట్ నెమ్మదించింది. మా బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. డ్యూ ప్రభావం కారణంగా టాస్ గెలిస్తే మేమూ మొదట బౌలింగే ఎంచుకునే వాళ్లం. అదృష్టం కొద్దీ రెండో ఇన్నింగ్స్లో రాణించాం. కెప్టెన్సీ విషయానికొస్తే బాగా ఆస్వాదిస్తున్నా. అందుకు కారణం మా ఆటగాళ్లు. వాళ్లెంతో మెరుగ్గా రాణించి పరిస్థితులను తేలిక చేస్తున్నారు. రోజు రోజుకూ మెరుగవ్వడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉంది.'అని అయ్యర్ తెలిపాడు.

ఏదైనా జరగవచ్చు..
ఇక లక్ష్యచేధనలో రాజస్థాన్ తడబడినప్పుడు టార్గెట్ కాపాడుకుంటామనే నమ్మకం కలిగిందా అని ప్రశ్నించగా.. ‘ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ దశలోనైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అందుకే మేం జట్టును తేలిగ్గా తీసుకోం. ప్రతీ మ్యాచ్కు ప్రత్యర్థికి అనుగుణంగా ప్రణాళికలతో బరిలోకి దిగి అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మా సపోర్ట్ స్టాఫ్ మద్దతు పట్ల కూడా సంతోషంగా ఉన్నా. వారు మమ్మల్ని అద్బుతంగా సిద్దం చేస్తున్నారు. ఇదే జోరును ముందు కొనసాగించాలని ఉంది. ఏ మ్యాచ్ను కూడా తేలిగ్గా తీసుకోం.' అని శ్రేయస్ పేర్కొన్నాడు.

హెట్మైర్ మెరుపులు..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications