ముంబై: టెస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారాపై ఓపెనర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కరోనా కారణంగా దేశంలో లాక్డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మ్యాచ్లు, ప్రాక్టీస్లు లేకపోవడంతో.. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లు సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా పుజారా తను క్రికెట్ని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోని పెట్టిన అతను.. 'ఈ లాక్డౌన్ సమయంలో నేను అత్యంత మిస్ అవుతుంది క్రికెట్నే'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు.
అయితే ఈ పోస్ట్పై శిఖర్ ధావన్ సెటైర్ వేశాడు. 'అవునా.. నువ్వు క్రికెట్ను మిస్ అవుతున్నావనే విషయం మాకు తెలియదే..'అంటూ ధవన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇక మురళీ విజయ్, ఉమేశ్ యాదవ్లు కూడా పుజారా ఫొటోపై కామెంట్ చేశారు. ''అవును, నువ్వు చెప్పింది నిజమే'' అంటూ మురళీ విజయ్ కామెంట్ చేయగా.. ఉమేశ్ యాదవ్ ఓ ఎమోజీ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఇక పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్షగా నిలుస్తూ.. భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారిగా టెస్ట్ సిరీస్లో విజయం సాధించడంలో పుజారా పాత్ర ప్రధానమైనది. ఆసీస్ బౌలర్ల ఓపికకు పరీక్ష గా నిలిచిన పుజారా.. ఆ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్ట్ నెంబర్ వన్ బౌలర్ ప్యాట్ కమిన్స్ కూడా పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. అత్యంత కఠినమైన బ్యాట్స్మన్ అని చెప్పుకొచ్చాడు.
ఒక్కసారి కాఫీ తాగే.. భారీ మూల్యం చెల్లించుకున్నా: హార్దిక్ పాండ్యా