కరాచీ: కరోనా వైరస్ బారినపడిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా తాజాగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో 'నెగెటివ్'గా నిర్ధారణ అయినట్లు అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'ఆ అల్లా దయవల్ల నేను, నా సతీమణి, కూతుళ్లు అక్సా, అన్షా కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. మేం కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధించిన మీ అందరికి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది'అని అఫ్రిది ట్వీట్ చేశాడు.
గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్గా తేలాడు. ఈ విషయాన్ని అతనే ట్విటర్ వేదికగా తెలియజేసి అభిమానుల ఆశీర్వాదాలను కోరాడు. 'రెండు రోజుల నుంచి నేను కొంచెం అస్వస్థతకు లోనయ్యా. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తు పాజిటీవ్ అని తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీరంతా ఇంట్లోనే భద్రంగా ఉండండి' అని ఈ పాక్ మాజీ కెప్టెన్ 20 రోజుల క్రితం ట్వీట్ చేశాడు. ఇక అఫ్రిది మహమ్మారి నుంచి కోలుకోవాలని అతని చిరకాల ప్రత్యర్థి గౌతమ్ గంభీర్ కూడా ఆకాంక్షించిన విషయం తెలిసిందే.
1996లో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అఫ్రిది.. తన సుదీర్ఘ కెరీర్లో 27 టెస్ట్లు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. సంప్రదాయక ఫార్మాట్లో 1716, 50ఓవర్ల ఆటలో 8064, పొట్టి క్రికెట్లో 1416 రన్స్ చేశాడు.
లెగ్ స్పిన్నర్ అయిన అఫ్రిది టెస్ట్ల్లో 48, వన్డేల్లో 395, టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. 2011 ప్రపంచకప్లో జట్టును నడిపించిన ఈ ఆల్రౌండర్ సెమీస్ వరకు తీసుకెళ్లాడు. కానీ భారత్ చేతిలో ఓడి ప్రపంచకప్ను అందుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నెలకొల్పాడు. కానీ 2014లో న్యూజిలాండ్ ప్లేయర్ కోరె అండర్సన్ దీన్ని బద్దలు కొట్టగా.. 2015లో సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మృతి.. శోకసంధ్రంలో క్రికెట్ ప్రపంచం!