ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన ఆల్టైమ్ ఎలెవన్ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక ప్లేయర్ను ఎంపిక చేశాడు. తనతో కలిసి ఆడి, తలపడిన క్రికెటర్లతో ఆల్టైమ్ బెస్ట్ టీమ్ ప్రకటించిన అఫ్రిది.. అందులో ఏకంగా ఐదుగురు పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు. భారత్ నుంచి కేవలం సచిన్ టెండూల్కర్కు మాత్రమే అవకాశం కల్పించాడు. ఇక ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ను జట్టులోకి తీసుకున్న అఫ్రిదీ.. వికెట్ కీపర్గా మాత్రం పాకిస్థాన్కు చెందిన రషీద్ లతీఫ్ను ఎంపిక చేశాడు. ఇక తన ఆల్ టైమ్ జట్టు వివరాలను అఫ్రిదీ ఓ యూట్యూబ్ చానెల్ ద్వారా తెలియజేశాడు.
ఇక అత్యుత్తమ నైపుణ్యం కలిగిన భారత ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం పట్ల అఫ్రిది ఎలెవన్ జట్టుపై భారత్ అభిమానులు మండిపడుతున్నారు. ధోనీని కీపర్గా ఎంచుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్న ఫ్యాన్స్.. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ జయసూర్య, వెస్టిండీస్ మాజీ బ్యాట్స్మెన్ బ్రియాన్ లారాకు చోటివ్వకపోవడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ను ఓపెనర్గా కాకుండా.. నాలుగో స్థానంలో ఆడించాలని యోచించడం కూడా సరికాదంటున్నారు. అసలు అది ఆల్టైమ్ జట్టుగా లేదని పాకిస్తాన్ జట్టేనని విమర్శిస్తున్నారు.
అఫ్రిది ఆల్టైమ్ ఎలెవన్ టీమ్: సయీద్ అన్వర్ (పాకిస్థాన్), ఆడమ్ గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), సచిన్ టెండూల్కర్ (భారత్), ఇంజుమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్), జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా), రషీద్ లతీఫ్ (పాకిస్థాన్), వసీమ్ అక్రమ్ (పాకిస్థాన్), షేన్వార్న్ (ఆస్ట్రేలియా), గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా), షోయబ్ అక్తర్ (పాకిస్థాన్)
పాకిస్థాన్లో కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అతని సేవకు ముగ్దులైన భారత వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. అఫ్రిది ఫౌండేషన్కు ఆర్థిక చేయాలని అభిమానులకు సూచించారు. దీనిపై కూడా అభిమానులు మండిపడ్డారు. శతృదేశానికి సాయం చేయమంటారా? ఈ భారత ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సరిహద్దుల కన్నా మానవత్వం గొప్పదని ఈ స్టార్ క్రికెటర్లు ట్రోలర్స్ నోర్లు మూయించారు. అఫ్రిది కూడా తనకు సాయంగా నిలిచిన భజ్జీ, యూవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.