ముంబై: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ట్రిపుల్, డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించిన ముంబై యువ బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తన మెరుపు ఇన్నింగ్స్లతో పలు ఘనతలను తనపేరిట లిఖించుకున్న సర్ఫరాజ్.. మధ్యప్రదేశ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో 177 పరుగులతో తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నా.. ఈ సీజన్ను ఘనంగా ముగించాడు. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో 71, 31 పరుగులు మాత్రమే చేసిన ఈ ముంబై సెన్సేషన్.. ఉత్తర్ప్రదేశ్తో ట్రిఫుల్ సెంచరీతో మొదలెట్టి ఆఖరి మ్యాచ్ వరకు పరుగుల విధ్వంసాన్ని కొనసాగించాడు.
మూడో బ్యాట్స్మన్గా..
ఈ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన ఈ ముంబై సెన్సేషన్ 9 ఇన్నింగ్స్ల్లో 154.66 సగటుతో 928 పరుగులు చేశాడు. ఇందులో ఒక ట్రిపుల్, డబుల్ సెంచరీతో పాటు ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తద్వారా రంజీ క్రికెట్ చరిత్రలో 750కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్మన్ జాబితాలో అత్యధిక యావరేజ్ కలిగిన మూడో బ్యాట్స్మన్గా సర్ఫరాజ్ చరిత్రకెక్కాడు.
మార్చి 25న ఐపీఎల్ ఆల్స్టార్ గేమ్.. కోహ్లీ, రోహిత్ ఒక్కటీమ్లోనే.. కెప్టెన్గా ధోని!
ఈ జాబితాలో అశోక్ మన్కడ్(బాంబే) 206.75 యావరేజ్తో అగ్రస్థానంలో ఉండగా.. రుసి మోడీ 201.6 సగటుతో సర్ఫరాజ్ఖాన్ కన్నా ముందు వరుసలో ఉన్నాడు. 1976/77 సీజన్లో అశోక్ మన్కడ్ 6 మ్యాచ్లు 8 ఇన్నింగ్స్ల్లో 827 పరుగులు చేయగా.. రుసి మోడీ 19944/45 సీజన్లో 7 ఇన్నింగ్స్ల్లో 1008 పరుగులు చేసాడు.
మరో 72 పరుగులు చేసుంటే..
ఇక ఈ సీజన్లో సర్ఫరాజ్ 1000 పరుగులు పూర్తి చేసుంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాట్స్మన్గా గుర్తింపు పొందేవాడు. ఈ జాబితాలో రుసి మోడీ(1944/45) ఏడు ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించగా.. తమిళనాడు బ్యాట్స్మెన్ వీవీ రామన్(1988/89), శ్రీరామ్(1999/00) 9 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేశారు.
ఆరో బ్యాట్స్మన్గా..
ఇక ముంబై తరపున ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన లిస్ట్లో సర్ఫరాజ్ ఆరో బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ 1321 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వసీమ్ జాఫర్(1260), అజింక్యా రహానే(1089), రుసి మోడీ (1008), అభిషేక్ నాయర్ (966)లు సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందున్నారు. ఇక 18 ఇన్నింగ్స్ల్లో శ్రేయస్ ఈ ఘనతను అందుకోగా.. సర్ఫరాజ్ కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే 928 పరుగులు చేయడం విశేషం.
దిగ్గజాల సరసన చోటు:
ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ (391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ముంబై తరఫున ఈ ఘనత అందుకున్న ఏడో బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబై తరఫున ట్రిపుల్ సెంచరీలు చేసారు.