ఏకైక మ్యాచ్, వికెట్..
యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో సచిన్ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. పైగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా ఈ టీ20 ఫార్మాట్పై ఆరంభంలో పెద్దగా ఆసక్తికనబర్చలేదు. దాంతో సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ధోనీ నేతృత్వంలోని భారత యువ జట్టు 2007 టీ20 ప్రపంచకప్ ఆడి టైటిల్ గెలిచింది.
ఇక సచిన్ ఆడిన ఏకైక టీ20లో ఓ వికెట్ కూడా తీశాడు. సౌతాఫ్రికాతో జోహన్నస్బర్గ్ వేదికగా 2006 జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో 2.3 ఓవర్లు వేసిన సచిన్.. సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్మన్ జస్టిన్ కెంప్(22)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో కెంప్.. సచిన్ ఏకైక టీ20 వికెట్గా చరిత్రలో నిలిచిపోయాడు.
భారత ఘన విజయం..
ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్లతో ఘనవిజయాన్నందుకుంది. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా.. సూపర్ పెర్ఫామెన్స్తో సౌతాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. కెప్టెన్ గ్రేమ్ స్మిత్(26), జస్టిన్ కెంప్(22), మోర్కెల్(27), జొహన్(21) మినహా మరే బ్యాట్స్మన్ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు. విధ్వంసకర బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్(6) దారుణంగా విఫలమయ్యాడు. భారత బౌలర్లలో అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ రెండే వికెట్లు తీయగా.. శ్రీశాంత్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మెరిసిన కార్తీక్..
127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. సచిన్ టెండూల్కర్(10) వికెట్ను ఆదిలోనే కోల్పోయింది. అయినా క్రీజులోకి వచ్చిన దినేశ్ మోంగియా( 38) సాయంతో సెహ్వాగ్(34) ధాటిగా ఆడాడు. కానీ సెహ్వాగ్, ధోనీ(0), మోంగియా వరుసగా పెవిలియన్ చేరడంతో టీమిండియా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్తో జట్టుకు విజయాన్నందించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 31 పరుగులతో అజేయంగా నిలిచి 19.5 ఓవర్లలో విజయాన్నందించాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.